ఆంధ్రప్రదేశ్లో ఓ విచిత్రమైన రాజకీయ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో బిజెపి, జనసేనలు మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఒకదానిని మరొకటి నమ్మవు. వాటి మద్య సత్సంబంధాలు కూడా లేవు. జనసేనకు బిజెపికి మద్య రాష్ట్రంలో సామాజిక దూరం ఏర్పడిందని, కానీ బిజెపి అధిష్టానంతో టచ్చులోనే ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. బిజెపితో ప్రస్తుతానికి పొత్తులోనే ఉన్నామని కానీ రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చెప్పలేమని అన్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, పురందేశ్వరి వంటి సీనియర్ నేతలు కూడా జనసేన మాతోనే ఉంది కానీ దాంతో సంబంధాలు లేవని చెపుతుంటారు.
ఇక రాష్ట్రంలో బిజెపి నేతలు వైసీపీని తమ రాజకీయ శ్రత్రువుగా భావిస్తూ నిత్యం సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రభుత్వ పనితీరును విమర్శిస్తూనే ఉంటారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డావంటివారు కూడా అప్పుడప్పుడు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి వెళుతుంటారు.
మరోపక్క వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రహోంమంత్రి అమిత్ షాలతో సన్నిహితంగా మెలుగుతుండటం, వారు కూడా విజయసాయి, జగన్లతో సన్నిహితంగా మెలుగుతుంటారు. ఇందుకు తాజా ఉదాహరణగా సిఎం జగన్మోహన్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి ప్రధాని నరేంద్రమోడీ నిన్న భీమవరానికి వచ్చి ఆయనతో కలిసి స్వాతంత్ర సమరవీరుడు అల్లూరి సీతారామారాజు 125వ జయంతి ఉత్సవంలో పాల్గొని, అనంతరం సిఎం జగన్తో కలిసి బహిరంగసభలో పాల్గొనడాన్ని చెప్పుకోవచ్చు.
భీమవరంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ, రాష్ట్ర బిజెపి ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. కానీ బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు!
ఇక బిజెపి-వైసీపీల మద్య గల చక్కటి అవగాహనకు మరో నిదర్శనంగా రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకి వైసీపీ బేషరతుగా అంగీకరించడాన్ని చెప్పుకోవచ్చు. అయితే బిజెపికి తమ పార్టీ మద్దతు ఇస్తుండటంలో ఎటువంటి దాపరికం లేదని వైసీపీ ఏలూరు ఎంపీ శ్రీధర్ కుండబద్దలు కొట్టారు.
ఈరోజు ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న తరువాత మీడియాతో మాట్లాడుతూ,“మేము గత మూడేళ్ళుగా కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే ఉన్నాము. ఇక ముందు కూడా ఇస్తాము. ఇందులో దాపరికం ఏమీ లేదు. మేము కేంద్రానికి మద్దతు ఇస్తునందునే రాష్ట్రానికి రావలసిన నిధులు వగైరా వస్తున్నాయి. ఇదే విదంగా వ్యవహరిస్తూ ఏపీకి ప్రత్యేకహోదా కూడా సాధిస్తాము,” అని అన్నారు.
ఇంతకీ బిజెపి జనసేనతో ఉందా లేక వైసీపీతో ఉందా?జనసేన బిజెపితో ఉంటుందా టిడిపివైపు వెళుతుందా?అనే ప్రశ్నలకు ఎన్నికల దగ్గర పడ్డాక సమాధానాలు లభిస్తాయి.



