కేంద్రంలో ఉన్న అధికారాన్నే తమ అవకాశంగా మార్చుకుని తనకు రాజకీయంగా ఎదుగుదల లేని రాని ఏపీ రాష్ట్రం పై గడిచిన కొన్నేళ్లుగా తన పవర్ కొనసాగిస్తూనే ఉంది బీజేపీ. మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా రాజకీయ పార్టీల బలహీనతలను అడ్డుపెట్టుకుని ఏపీ ప్రజలతో బీజేపీ రాజకీయ చదరంగాన్ని ఆడుతూనే వస్తుంది.
ఎన్నిరాజకీయ చదరంగాలు ఆడినా ప్రజలను మెప్పించలేకపోతుంది, వారి ఆశీస్సులను పొందలేకపోతుంది బీజేపీ అధిష్టానం. కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలి అన్నా కూడా బీజేపీ అధిష్టానం ఆశీస్సులు తప్పనిసరి అనేలా ఎన్నికల వాతావరణాన్ని మాత్రం సృష్టించగలిగారు.
ఈ ప్రక్రియలో భాగంగానే నిన్న బాబుతో చర్చలు, నేడు పవన్ తో భేటీలు, రేపు జగన్ తో మంతనాలు…ఇలా మూడు రాజకీయ పార్టీలతో బీజేపీ పెద్దలు “మూడు స్తంభాలాట” ఆడుతున్నారు. మరి ఈ మూడు స్తంభాలాటలో చివరికి పోరాడి ఓడే ఆ అభిమన్యుడు ఎవరనేది రానున్న కొద్దీ రోజులలోనే మూడు రాజకీయ పార్టీలతో పాటు ఏపీ ప్రజలకు కూడా ఒక స్పష్టత రానుంది.
తానూ రాజకీయంగా బలపడలేకపోయిన పక్క వారి బలహీనతను కాష్ చేసుకుంటూ ఏపీ రాజకీయాలలో చక్రం తిప్పుతుంది బీజేపీ. ఎవరు ఔనన్నా కాదన్నా బీజేపీ పెద్దల ఆశీస్సులు లేకుండా ఏపీ రాజకీయాలలో రాణించడం అంటే కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్ లో సీటు సంపాదించినట్టే అనేది సుస్పష్టం.
ఉన్న అధికారాన్ని మరో సారి నిలబెట్టుకోవడానికి ఒకరు, పోయిన అధికారాన్ని తిరిగి రాబట్టుకోవడానికి ఒకరు, ఏపీలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దెదింపడమే అంతిమ లక్ష్యంగా మరొకరు ఇలా ఎవరి ప్రయోజనాల కోసం వారు కేంద్ర పెద్దల ఆశీస్సులకై ”అయినను పోయిరావలె హస్తినకు” అంటూ ఢిల్లీ ఫ్లయిట్ ఎక్కుతున్నారు, దిగుతున్నారు.
కాకపోతే నేను అభిమన్యుడిని కాదు అర్జునుడిని అంటూ భీరాలు పోయే వ్యక్తి కూడా నాకు అండగా శ్రీకృష్ణుడి లాంటి ఏపీ ప్రజలు ఉన్నారు అంటూ చెప్పి శ్రీ కృష్ణుడిని కాదని మరొకరి సాయం కోసం ఆరాటపడమే ఈ ఆటలో కొసమెరుపు. చివరికి ఆ బీజేపీ ఆడుతున్న మూడు స్తంభాలాటలో బీజేపీ అనే స్తంభాన్ని తాకలేక ఆట నుంచి ఔటయ్యి బయటకు వచ్చెదవరో..?




