తెలంగాణలో మునుగోడు వేదికగా టిఆర్ఎస్, బిజెపిల మద్య జరుగుతున్న ఆధిపత్య పోరులో నిన్న సాయంత్రం మరో రాజకీయ విస్పోటనం జరిగింది. నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను బిజెపిలోకి ఆకర్షించేందుకు రంగంలో దిగిన ముగ్గురు వ్యక్తులను హైదరాబాద్ పోలీసులు వలపన్ని కాపుకాసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు.
ఫరీదాబాద్లో ఓ ఆలయంలో పనిచేస్తుండే రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మ, అన్నమయ్య జిల్లాలో శ్రీమంత్రరాజ మఠాధిపతి స్వామీ సింహయాజీ, హైదరాబాద్లో హోటల్ బిజినెస్ చేస్తున్న నందకుమార్ ముగ్గురూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికీ రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఇప్పిస్తామని బేరం సెటిల్ చేసుకొని ముందుగా రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చేందుకు వచ్చారని సైబరాబాద్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. కానీ ఆ ఎమ్మెల్యేలు తమకు ముందే ఈ సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు.
హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ వద్ద అజీజ్ నగర్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌసు వద్ద ఈ సెటిల్మెంట్ జరుగుతుండగా పట్టుకొన్నామని చెప్పారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి దగ్గర బంధువు, వ్యాపార భాగస్వామి కూడా అయిన నందకుమార్ ద్వారా ఈ బేరసారాలు మొదలయ్యాయని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
తమను బిజెపిలో చేర్చేందుకు ఆ ముగ్గురు వ్యక్తులు బేరసారాలు చేసినట్లు టిఆర్ఎస్కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు. కానీ తాము తెలంగాణకు, కేసీఆర్కు ద్రోహం చేయదలచుకోలేదని అందుకే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి నిందితులను రెడ్-హ్యాండడ్గా పట్టించామని చెప్పారు. నిందితులను ప్రశ్నించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.
ఎమ్మెల్యే టికెట్ దొరికితే చాలనుకొనేవారు ఒక్కొక్కరికీ రూ.100 కోట్లు, కాంట్రాక్టులు ఇస్తామన్నా లొంగలేదంటే నమ్మశక్యంగా లేదు. నాలుగు వందల కోట్లుకి డీల్ మాట్లాడుకొని కేవలం రూ.15 కోట్లు మాత్రమే అడ్వాన్స్ ఇస్తుండటమే ఈ అనుమానం కలిగిస్తోంది. ఇంతకీ నిజంగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిజెపి ఇంత భారీ మొత్తం ఆఫర్ చేసిందా?లేక మునుగోడు ఉపఎన్నికలలో బిజెపిని ఓడించేందుకు టిఆర్ఎస్ పార్టీయే ఈ డ్రామా ఆడిందా?అనే విషయం త్వరలోనే బయటకు వస్తుంది. దీనిపై బిజెపి ఇంకా స్పందించాల్సి ఉంది.



