ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి నుంచి ‘ఇదిగో… ఇదే మా రాజధాని అమరావతి..’ అని ప్రతీ ఆంధ్రుడు గర్వంతో చెప్పుకునే విధంగా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తోంది.
నేటికీ వైసీపీ అమరావతిని అంగీకరించక మావిగన్ అంటుంటే, ఎక్కడో బాలీవుడ్లోని సినీ నిర్మాణ సంస్థలు, సంజయ్ దత్ వంటి సినీ నటులు అమరావతిలో పెట్టుబడులు పెట్టి స్టూడియోలు వగైరా నిర్మించేందుకు ముందుకొస్తున్నారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలే 70 ఉన్నాయి. ఇంకా స్టార్ హోటల్స్, ప్రైవేట్ యూనివర్సిటీలు, కార్పోరేట్ హాస్పిటల్స్ వంటివి మరో 44 ఉన్నాయి.
ఇన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, బాలీవుడ్ కూడా అమరావతికి రావాలని ఎందుకు అనుకుంటున్నాయి? అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యద్భుతంగా నిర్మిస్తున్న అమరావతి, భవిష్యత్లో యావత్ దక్షిణ భారతదేశంలో కీలకంగా మారే అవకాశం ఉన్నందునే.
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు బాలీవుడ్లో పలు నిర్మాణ సంస్థలు ముందుకు వచ్చాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
అయితే వాటికి భూకేటాయింపులు చేయాలంటే పెట్టుబడి పెట్టాలనుకుంటున్న సంస్థ లేదా వ్యక్తుల ఆర్ధిక పరిస్థితి, వారు ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్ వివరాలు, దానికి సంబంధించి వారి ప్రణాళికలు, డీపీఆర్ వగైరాలు సమర్పించాలని కోరామని మంత్రి నారాయణ చెప్పారు. ప్రముఖ నటుడు అమరావతిలో స్టూడియో నిర్మించాలనుకుంటున్నారు.
ఎక్కడో ఉన్న బాలీవుడ్ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటే, ఏపీ సిఎం, డెప్యూటీ సిఎం, సినిమాటోగ్రఫీ మంత్రి పదేపదే ఆహ్వానిస్తున్నా టాలీవుడ్ ప్రముఖులు ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
కానీ సినీ పరిశ్రమలో ఏవైనా సమస్యలు ఏర్పడినప్పుడు, పెద్ద సినిమాల టికెట్ ధరలు పెంచుకోవాల్సినప్పుడు మాత్రం ఏపీ సిఎం, డెప్యూటీ సిఎంలను కలిసి సహాయసహకారాలు అందించాల్సిందిగా కోరుతుంటారు.
టాలీవుడ్ పెద్దల తీరు ఈవిధంగా ఉన్నందునే గత ప్రభుత్వం తగిన ట్రీట్మెంట్ ఇచ్చింది కూడా. అయినా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. టాలీవుడ్ రాకపోయినా బాలీవుడ్ వస్తే చాలు.




