వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’ పేరుతో నిరసన సభలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూడా విజయనగరం జిల్లాలో చీపురపల్లిలో వెన్నుపోటులో పాల్గొన్నారు.
కానీ వడదెబ్బ తగలడంతో వేదికపై సొమ్మసిల్లిపోయారు. దీంతో అనుచరులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సిలైన్ ఎక్కించి, ఆక్సిజన్ అందించడంతో కొలుకున్నారు.
సంక్షేమ పధకాల పేరుతో తాను ప్రజలకు డబ్బు పంచిపెడితే వారు ఎన్నికలలో ఓట్లు వేయకుండా తనకు వెన్నుపోటు పొడిచారని జగన్ అప్పుడే ఆవేదన చెందారు.
ఏడాది గడిచినా జగన్ ఆ వెన్నుపోటుని మరిచిపోలేకపోయారని నిరూపిస్తూ తన ఓటమి ప్రకటన వెలువడిన ఈరోజు (జూన్ 4)న వెన్నుపోటు పొడిచారంటూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే, సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పాపం తీవ్ర అస్వస్థతకి గురయ్యారు.
సిఎం చంద్రబాబు నాయుడుని దెప్పిపొడిచేందుకు ‘వెన్నుపోటు’ అనే పదాన్ని పట్టుకు వ్రేలాడుతున్న జగన్, అదే పేరుతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పైశాచిక ఆనందం పొందుతుండవచ్చు గాక. కానీ ఇదో తప్పుడు రాజకీయ కార్యక్రమం అని అందరూ నవ్వుకుంటున్నారనే విషయం జగన్ పట్టించుకోవడం లేదు.
పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు బొత్స సత్యనారాయణతో సహా పార్టీలో ఎవరూ జగన్కు చెప్పే సాహసం చేయలేక ఇలా సొమ్మసిల్లి హాస్పిటల్ పాలవుతున్నారు పాపం!




