విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయట! కనుక త్వరలోనే శంకుస్థాపన చేస్తారట! ముందుగా భూసేకరణ మొదలుపెడతారట! మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారీ విషయాలు.
భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి అన్ని అవరోధాలు తొలగిపోయినందున ఈరోజు విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి దీని గురించి చర్చించారు. దీంతోపాటు గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా శంకుస్థాపన చేయాలని భావిస్తున్నందున దానికీ భూసేకరణ ప్రక్రియను ప్రారంభిస్తామని మంత్రి బొత్స తెలిపారు.
మంచిదే! అమరావతి నిర్మాణం ఎలాగూ మరో 60 నెలలో పూర్తి చేస్తామని చెప్పారు కనుక ఇక దాని గురించి ఆలోచించక్కరలేదు. పోలవరం ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్ళి చేసుకొనేలోగా పూర్తి చేస్తామన్నారు కనుక దాని గురించి కూడా ఆలోచించక్కరలేదు. కానీ మరో ఏడాదిన్నరలో ఎన్నికలు పెట్టుకొని ఇప్పుడు భోగాపురం విమానాశ్రయానికి, గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తామంటున్నారు. అదే డౌట్ కొడుతోంది!
చంద్రబాబు నాయుడుపై కక్షతో అమరావతిని పాడుబెడుతున్న జగన్ సర్కార్, ఆయన ప్రతిపాదించిన భోగాపురం విమానాశ్రయాన్ని ఎందుకు పక్కన పడేయడం లేదు?ఎందుకు చేపట్టాలనుకొంటున్నారు?అంటే సమాధానం మంత్రి బొత్స సత్యనారాయణ మాటలలోనే ఉంది.
ఇప్పుడు రెండింటికీ భూసేకరణ మొదలుపెడతామని చెప్పారు. అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా అనుకోవచ్చు. వీటి పేరు చెప్పి విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు హైవేకి అనుకోని ఉన్న వేలాది ఎకరాలను వైసీపీ నేతలు కూడా సంపాదించుకొనే అవకాశం లభిస్తుంది. ఎలాగూ విశాఖ రాజధాని అంటూ ఇప్పటికే విశాఖ నగరంతో సహా మూడు జిల్లాలలో వైసీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు చేశారు కనుక భోగాపురం విమానాశ్రయం కట్టినా, కట్టకపోయినా శంకుస్థాపన, భూసేకరణ పేరుతో హడావుడి చేస్తూ తమ భూములకి, వాటిలో వేయబోయే వెంచర్లకి మంచి ధర పలికేలా చేసుకోవడం వారి చేతుల్లో పనే! కనుక భోగాపురం విమానాశ్రయం చాలా అవసరమే! వారి కోసం కాదు సుమీ.. ఉత్తరాంద్ర అభివృద్ధి కోసమే!



