వైసీపీ సీనియర్ నాయకులలో విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణ ఒకరు. ఆయన సమైక్య రాష్ట్రంలోనే మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడుగా చేశారు. తర్వాత జగన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా చేశారు. కనుక అపారమైన రాజకీయ, పరిపలనానునుభవం ఆయనకున్నాయి.
జగన్ ప్రభుత్వంలో విద్యాశాఖకు బదులు మునిసిపల్, రెవెన్యూ వంటి వేరేదైనా శాఖ ఇచ్చి ఉండి ఉంటే ఆయన సామర్ధ్యం బయటపడి ఉండేది. కానీ జగన్ విద్యాశాఖలో సంస్కరణల పేరుతో ఆటాడుకున్నందున దాని పర్యవసానాలు, చెడ్డపేరు బొత్స పద్దులో జమా అయ్యాయి.
ఆయన అనుభవానికి వైసీపీలో గుర్తింపు, గౌరవం లేనప్పటికీ నాడు, నేడు ఏపీ రాజకీయాలలో బొత్స సత్యనారాయణ కీలకంగానే ఉన్నారు.
జగన్ అవమానింపబడతాననే భయంతో శాసనసభ సమావేశాలకు మొహం చాటేస్తుంటే, బొత్స సత్యనారాయణ మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడరుగా కూటమి ప్రభుత్వాన్ని ఒంటరిగా చాలా ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. కనుక బొత్స వలన వైసీపీకి ఎంతో కొంత మేలే కలుగుతోంది తప్ప ఎటువంటి నష్టమూ జరుగట్లేదని చెప్పవచ్చు.
ఇక వైసీపీలో మళ్ళీ నంబర్: 2 స్థానంలోకి వచ్చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి కారణంగానే నాడు వైసీపీ ఎన్నికలలో ఓడిపోయింది. ఆయన కారణంగానే ఇప్పుడు తాము కేసుల్లో ఇరుక్కున్నామని పోసాని వంటివారు బహిరంగంగానే చెప్పారు.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా సజ్జల కారణంగానే పార్టీకి నష్టం కలుగుతోందని, అధినేతకు క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోకుండా చేస్తున్నారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. పార్టీని జగన్ నడిపిస్తున్నారా లేక సజ్జలా? అనే ప్రశ్న ‘అసమదీయ మీడియా’లోనే వినిపించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
అమరావతి విషయంలో జగన్ వైఖరికి భిన్నంగా మాట్లాడి పార్టీ విశ్వసనీయతని సజ్జల మరింత దెబ్బ తీశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బొత్స వెర్సస్ సజ్జలని బేరీజు వేసి చూస్తే బొత్స యధాశక్తిన వైసీపీకి సాయపడుతుంటే, సజ్జల వైసీపీకి నష్టం కలిగిస్తూనే ఉన్నారని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. కనుక బొత్స సత్యనారాయణని వైసీపీలో నంబర్:2 స్థానంలోకి తెచ్చి, సజ్జలకు కొంతకాలం విశ్రాంతి ఇస్తే మంచిదేమో?





