రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా పాలకులను దొంగలు, దోపిడీదారులు, రాక్షసులని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు వాదించేవారు. 11 ఏళ్ళ తర్వాత కూడా వారిలో ఆ ద్వేషం అలాగే సజీవంగా ఉంది. నిజానికి ఆ ద్వేషమే వారి పార్టీ రాజకీయ విధానంగా మారింది.
ఏపీలోని వైసీపీ కూడా సరిగ్గా ఈ విధానంతో రాజకీయాలు చేస్తూ, అందుకు అమరావతిని బలి చేయడానికి వెనకాడలేదు.
కానీ ఆ ద్వేషంతో చివరికి వారు, వారి పార్టీలే తీవ్రంగా నష్టపోయాయి. కానీ తమలో నరనరాన్న జీర్ణించుకుపోయిన ఈ ద్వేషానికి రాజకీయ ముసుగు తొడిగి, దానిని ప్రజలకు సైలైన్ ఎక్కించే ప్రయత్నం చేస్తూ మళ్ళీ పూర్వ వైభవం సాధించాలని వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల వైఖరి వలన రాష్ట్ర ప్రజలు రెండుగా నిలువునా చీలిపోతుండటం చాలా ఆందోళనకరం. ముఖ్యంగా గ్రామాలలో కలిసి మెలిసి జీవించే ప్రజలు కూడా ఇవి చేస్తున్న రాజకీయాలతో రెండు వర్గాలుగా విడిపోతున్నారు.
ఈ రెండు పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఏవిధంగా అభివృద్ధి చేస్తామో చెప్పడం లేదు. తాము వస్తే ఎవరెవరి తాట తీస్తామో, ఏవిధంగా తీస్తామో చెపుతున్నాయి.
తమని ఎన్నుకుంటే ఏం చేస్తామో వారు చాలా స్పష్టంగా చెపుతున్నారు. కనుక రెండు రాష్ట్రాలలో ప్రజలే తమకు ఏది అవసరమో ఆలోచించుకొని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి రాజకీయ ప్రయోగం చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తెలంగాణలో ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని గద్దె నెక్కించారు. కనుక వారు కూడా ఏది మంచో ఏది చెడో అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారిప్పుడు.
కనుక 2028-29 శాసనసభ ఎన్నికలలో రెండు రాష్ట్రాలలో ప్రజల తీర్పు కాంగ్రెస్, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీల భవిష్యత్ని నిర్దేశిస్తుందని భావించవచ్చు.






