తెలంగాణ అనే పదానికి పర్యాయపదం బిఆర్ఎస్ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు ఆ పార్టీ నాయకులు. పార్టీ పేరు నుంచి తెలంగాణ అనే పదాన్ని తొలగించినా ఆ పదం తో చేసే రాజకీయాన్ని మాత్రం బిఆర్ఎస్ వదులుకోలేకపోతుంది.
కోనసీమ పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి కొబ్బరి రైతుల గోడు వింటూ, వారి దయనీయ పరిస్థితిని చూస్తూ చేసిన ఒక ప్రకటన బిఆర్ఎస్ కు అస్త్రంగా మారింది. అలాగే వారికో రాజకీయ అవకాశాన్ని ఇచ్చింది.
కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలింది, ఒకరకంగా రాష్ట్ర విభజనకు కూడా ఈ కోనసీమ పచ్చదనే కారణం అవ్వొచ్చు అంటూ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ వ్యాఖ్యానించడంతో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా భావించే బిఆర్ఎస్ పవన్ కు కౌంటర్ ఇచ్చేసింది.
కోనసీమ కు తెలంగాణ నాయకుల దిష్టి తగలాడనికి హైద్రాబాద్ నుంచి ఎవరు కోనసీమ వెళ్లి జీవించడం లేదు, కానీ నిత్యం వందలాది, వేలాదిమంది కోనసీమ నుండి హైద్రాబాద్ కి వస్తున్నారు. అటువంటప్పుడు కోనసీమకు తెలంగాణ వారి దిష్టి ఎలా తగులుతుంది.?
బుర్ర లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా అయిపోతున్నారు. ఇకనైనా ఇటువంటి పిచ్చి మాటలు కట్టిపెట్టి నాలుకను కంట్రోల్ లో పెట్టుకోవాలి అంటూ బిఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
అయితే ఈ అంశంలోకి బిఆర్ఎస్ నాయకులు ఎంట్రీ ఇవ్వడంతో ఇక పవన్ చేసిన వ్యాఖ్యలను రెండు రాష్ట్ర ప్రజల ప్రాంతీయ సమస్యగా మార్చేందుకు బిఆర్ఎస్ వెనుకాడకపోవచ్చు. అలాగే పవన్ వ్యాఖ్యలకు బిఆర్ఎస్ మొదటి కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ అంటే అది బిఆర్ఎస్ అని, తెలంగాణ నాయకులు అంటే బిఆర్ఎస్ నాయకులే అనేలా ప్రజలలో ఒక బలమైన అభిప్రాయాన్ని బిఆర్ఎస్ బలపరిచేందుకు ప్రయత్నిస్తుంది.
మరి జగదీశ్ రెడ్డి కౌంటర్ కి జనసేన ప్రతి కౌంటర్ రెడీ చేస్తుందా.? లేదా మౌనంతో సరిపెడుతుందా.? అయితే ఇటువంటి సున్నితమైన అంశాల పై స్పందించేందుకు తెలంగాణ నాయకులు దూకుడుగా ముందుకొస్తే ఆంధ్రప్రదేశ్ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తారు.






