తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్, మంత్రులు, బిఆర్ఎస్ పార్టీ వాదనలను ఎవరూ తప్పు పట్టలేరు. కానీ ఆ అభివృద్ధి పేరుతో కేసీఆర్ కుటుంబం, మంత్రులు భారీగా అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్, బీజేపీ నేతల ఆరోపణలను కూడా ఖండించలేము.
ఎందుకంటే, కేవలం 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ దేశంలోనే అత్యంత ధనిక పార్టీలలో ఒకటిగా ఎదిగింది. ఈవిషయం కేసీఆర్ స్వయంగా, గర్వంగా చెప్పుకొన్నారు కూడా. కనుక ఆ డబ్బుతోనే కేసీఆర్ దేశంలోని ఏ రాష్ట్రంలో రాజకీయాలనైనా శాశించేస్థాయికి ఎదిగారని అర్దమవుతోంది.
అయితే ఇప్పుడు చర్చ కేసీఆర్ పోగేసుకొన్న వేలకోట్లు, ఆస్తుల గురించి కాదు. అభివృద్ధి గురించి.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. కనుక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ఇక చేయాల్సింది ఏమీ లేదని, రాహుల్ గాంధీ ఎలాగూ తెలంగాణ పర్యటనకు వచ్చారు కనుక అంఖాపూర్ చికెన్ సృష్టుగా తినేసి వెళ్ళిపోవాలని కేసీఆర్ కుమార్తె, కల్వకుంట్ల కవిత సూచించారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, బీజేపీలు చేయాలని అభివృద్ధిని కేసీఆర్ కేవలం 10 ఏళ్ళలో సాధించి చూపారని, కనుక అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ నాశనం చేయడానికి ప్రయత్నించవద్దని కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీకి హితవు పలికారు.
ఓ విధంగా చూస్తే కల్వకుంట్ల కవిత వాదన సహేతుకంగానే కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేసుకొన్నాము కనుక మా రాష్ట్రంలోకి మరే రాజకీయ పార్టీ రాకూడదు. ఎన్నికలలో పోటీ చేయకూడదు. అధికారం కోరుకోకూడదు… అనే ఆలోచన వింతండ వాదనగా, ఇంకా చెప్పాలంటే రాజరికపు పోకడగా కనిపిస్తుంది.
కాంగ్రెస్, బీజేపీలు వస్తే ఈవిదంగా, అదే టిడిపి పోటీకి సిద్దపడితే తెలంగాణను దోచుకోవడానికే ఆంధ్రా పార్టీ వస్తోందంటూ, ఇలా ఒక్కో పార్టీకి ఒక్కో ముద్ర, ఒక్కో కారణం చూపుతూ ‘మా రాజ్యంలోకి ఇతరులకు ప్రవేశం లేదు’ అని బోర్డు పెట్టిన్నట్లు మాట్లాడుతూనే, మళ్ళీ అది చాలా సహేతుకంగానే ఉందనిపించేలా వాదించడం కల్వకుంట్ల కుటుంబ సభ్యులకే చెల్లునేమో.




