తెలంగాణ రాజకీయాలలో నిన్నమొన్నటి వరకు బిఆర్ఎస్-బిజెపిల మద్య రాజకీయ ఆధిపత్య పోరు సాగుతుండేది. కానీ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడం కేసీఆర్ కూడా ఊచించని పరిణామమే. రేవంత్ రెడ్డి సారధ్యంలో మళ్ళీ కాంగ్రెస్ లేచి నిలబడటమే కాక కేసీఆర్ కూడా ఊహించనివిదంగా మళ్ళీ రెండో స్థానంలోకి వచ్చి నిలబడి సవాలు విసురుతోందిప్పుడు.
ఈ దేశముదురు కాంగ్రెస్ను ఏవిదంగా ఎదుర్కోవాలా అని చూస్తున్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ‘వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అవసరం లేదనే’ చిన్న మాటను ఆయుధంగా లభించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదంటున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొట్టండంటూ బిఆర్ఎస్ నేతలు ర్యాలీలు, నిరసన దీక్షలు, దిష్టి బొమ్మల దగ్ధాలు చేస్తూ చాలా హడావుడి చేస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ నేతలను ప్రజల ఎదుట దోషులుగా నిలిపి, బిఆర్ఎస్ పార్టీ చేజారకుండా కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్దమవుతూనే ఉంది.
అయితే బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ మరోసారి కాంగ్రెస్ నేతలకు అడ్డంగా దొరికిపోయింది.
రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని బిఆర్ఎస్ నేతలు గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, అవసరాన్ని బట్టి కొన్నిచోట్ల 5-6 గంటలు, మరికొన్ని చోట్ల 10-12 గంటలు మాత్రమే ఇస్తోందని, విద్యుత్ కార్యాలయాలలో ఉండే లాగ్ బుక్స్ ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి మొదలుపెట్టేసరికి బిఆర్ఎస్ మరోసారి షాక్ అయ్యింది.
ఎందుకంటే అదే వాస్తవం కనుక! ప్రతీరోజు ఏ గ్రామంలో ఎన్ని గంటలు విద్యుత్ సరఫరా చేశారో, ఎన్ని గంటలు నిలిపివేశారనే వివరాలను విద్యుత్ సిబ్బంది ఎప్పటికప్పుడు లాగ్ బుక్స్లో నమోదు చేస్తుంటారు. వాటిని బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు సవాలు విసరడం మొదలుపెట్టారు.
మంత్రి కేటీఆర్తో సహా ఎవరైనా సరే ఆ లాగ్ బుక్స్ పట్టుకొని వచ్చి తమతో బహిరంగ చర్చలో పాల్గొనాలని సవాలు చేస్తున్నారు. దీంతో బిఆర్ఎస్ నేతలు ఆ సవాలు స్వీకరించలేకపోతున్నారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి కరెంట్ షాక్ ఇద్దామనుకొంటే వాళ్ళే తిరిగి ఆయనకు షాక్ ఇవ్వడం విశేషమే కదా?
ఆ లాగ్ బుక్స్ కాంగ్రెస్ నేతల చేతికి చిక్కితే ఇంకా ఇబ్బంది పడాల్సివస్తుందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే వాటన్నిటినీ ఎలెక్ట్రికల్ ఏఈలు స్వాధీనం చేసుకోవాలని, ఆ పుస్తకాలలో వివరాలు బయటకు పొక్కనీయరాదని మౌఖిక ఆదేశాలు జారీ చేసిన్నట్లు తెలుస్తోంది.
అయితే కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ ఓ వాదన భుజానికి ఎత్తుకొంది కనుక దాంతోనే కంటిన్యూ అయిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ధర్నాలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు.
తమ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్న బండి సంజయ్ని ఆ పదవిలో తప్పించేసిన్నట్లే, ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా తప్పించేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు తెలంగాణలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక రేవంత్ రెడ్డి హోషియార్!



