పుంగనూరు విధ్వంసం కేసులో చిత్తూరు పోలీసులు జిల్లా టిడిపి ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రా రెడ్డిని (చల్లా బాబు)తో సహా మొత్తం 62 మంది టిడిపి నేతలు, కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వాటిలో చల్లా బాబుని ఏ-1గా పేర్కొన్నామని జిల్లా అడిషనల్ ఎస్పీ కె.లక్ష్మి తెలిపారు. టిడిపి కార్యకర్తల దాడులలో 50 మంది పోలీసులు గాయపడ్డారని తెలిపారు. చంద్రబాబు నాయుడే ఉద్దేశ్యపూర్వకంగా కార్యకర్తలను రెచ్చగొట్టడం వలన ఈ విధ్వంసం జరిగిందని జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.
పోలీసులు టిడిపి నేతలు, కార్యకర్తలపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంపై టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తీవ్రంగా స్పందించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఎక్కడ అల్లర్లు జరిగినా పోలీసులకు ముందుగా టిడిపి నేతలు, కార్యకర్తలే కనిపిస్తుంటారు. టిడిపి కార్యాలయాలపై, మా అధినేత చంద్రబాబు నాయుడుపై, పార్టీ కార్యకర్తలపై రాళ్ళతో, కర్రలతో దాడులు చేసిన వైసీపీ కార్యకర్తలు వారి కళ్ళకు కనిపించరు.
“పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటించడం నేరమా?ఓ మాజీ ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వస్తుంటే దారిలో లారీ అడ్డంగా పెట్టి మరీ ఆయనపై దాడులు చేసిన వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు?వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు?వైసీపీ కార్యకర్తలకు కర్రలు, రాళ్ళతో అక్కడికి వచ్చి నిలబడి ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా, పోలీస్ అధికారుల సంఘం వైసీపీ అనుబంద సంఘంలా వ్యవహరిస్తుండటం చాలా బాధాకరం,” అని బుద్దా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
“వైసీపీ నేతలు పోలీసులను, అధికారులను బూతులు తిడుతూ చెంపదెబ్బలు కొడుతున్నా వారికి తప్పుగా అనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం వారి జీతభత్యాల విషయంలో కోతలు పెడుతున్నా పోలీస్ అధికారుల సంఘం స్పందించదు. దీన్ని ఏమనుకోవాలని ప్రశ్నించారు. కొందరు పోలీస్ అధికారులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వైసీపీ నేతల కనుసన్నలలో పనిచేస్తూ, పోలీస్ శాఖకు అప్రదిష్ట కలిగిస్తున్నారని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు వైసీపీ నేతల ప్రాపకం కోసం ప్రాకులాడుతూ టిడిపి నేతలపై, కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నా పోలీస్ అధికారులందరినీ టిడిపి గుర్తుపెట్టుకొని, అధికారంలోకి వచ్చాక, విధులను అతిక్రమించి వారు చేస్తున్న ఈ పనులన్నిటికీ తగిన చర్యలు తీసుకొంటుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా పోలీస్ అధికారుల తీరుపై చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.



