‘ప్యాసింజర్’ను కాస్త ‘సూపర్ ఫాస్ట్’గా మార్చిన ‘కోహ్లి’

Virat Kohli, Virat Kohli India vs West Indies, Virat Kohli India vs West Indies Test Match , Captain Virat Kohli India vs West Indies, Captain Virat Kohli India vs West Indies Test  Matchటెస్ట్ మ్యాచ్ లంటే సహనంతో కూడుకున్న ఆట. అటు ఆడేవారిని, ఇటు వీక్షించే వారికి కాస్తంత ఓపిక అవసరం. అందుకే టెస్ట్ మ్యాచ్ లను రియల్ క్రికెట్ గా క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తుంటారు. అలాంటి టెస్ట్ సిరీస్ నే విండీస్ తో ఆరంభించింది టీమిండియా. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత ఇన్నింగ్స్ నత్తనడకన సాగి వీక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. తొలి వికెట్ ను మురళీ విజయ్ (7) రూపంలో 14 పరుగుల వద్దే కోల్పోవడంతో, మలి వికెట్ కోల్పోకుండా శిఖర్ ధావన్, పుజరాలు చాలా నింపాదిగా బ్యాటింగ్ చేసారు.

ADVERTISEMENT

వీరి జిడ్డు ఆటకు తొలి 27 ఓవర్లలో కేవలం 72 పరుగులు మాత్రమే లభించాయి. అయితే తర్వాత పుజారా (16) కూడా అవుటవ్వడంతో, క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేసాడు. అప్పటివరకు పరుగులు రావడమే గగనంగా మారి ‘ప్యాసింజర్’ రైలు మాదిరి నడుస్తున్న స్కోర్ బోర్డు వేగాన్ని ‘సూపర్ ఫాస్ట్’ మాదిరి నడిపించాడు. కోహ్లి అండతో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా దూకుడైన ఆటతో అలరించాడు. 84 పరుగులు చేసిన అనంతరం ధావన్ వెనుదిరగగా, ఆ తర్వాత బరిలోకి దిగిన రెహనే (22) కూడా భారీ స్కోర్ నమోదు చేయకుండానే పెవిలియన్ కు చేరుకున్నాడు.

అయితే మరో ఎండ్ లో కోహ్లి విధ్వంసం మాత్రం అలాగే కొనసాగింది. బౌండరీలను సాధిస్తూ కెరీర్లో తన 12వ సెంచరీ పూర్తి చేసిన విరాట్, తొలి రోజు ఆట ముగిసే సరికి 197 బంతుల్లో 143 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ సెంచరీతో టెస్టుల్లో 3000 పరుగులు పూర్తి చేసిన కోహ్లికి అండగా, రవిచంద్రన్ అశ్విన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కోహ్లి ఆధిపత్యంతో తొలి రోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించినట్లయ్యింది. అయితే రెండవ రోజు కూడా అదే దూకుడును కొనసాగించి, టీమిండియా స్కోర్ ను 302 నుండి 500 మార్క్ కు చేరిస్తే… మొదటి మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం కొనసాగించవచ్చని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories