అంటే ఎన్నికలలో మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ అని కాదు… వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-8 నిందితుడుగా సీబీఐ కోర్టు కూడా కన్ఫర్మ్ చేసిందని!
జూన్ 30వ తేదీతో ఈ కేసు విచారణ పూర్తి చేయాలని సాక్షాత్ సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే జూన్, జూలై మాత్రమే కాదు… ఆగస్ట్లో కూడా ఈ కేసు విచారణ జరుగబోతోంది.
వివేకా హత్య కేసులు సీబీఐ దాఖలు చేసిన అనుబంద ఛార్జ్ షీట్లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఏ-8 నిందితుడుగా పేర్కొంది. దానిని హైదరాబాద్లోని సీబీఐ కోర్టు కూడా కన్ఫర్మ్ చేసి, ఆగస్ట్ 14వ తేదీన ఈ కేసు విచారణకు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ ఆయనకు నోటీస్ పంపింది. కనుక ఆగస్ట్లో కూడా ఈ కేసు విచారణ మళ్ళీ మొదలయ్యి మరికొంతకాలం కొనసాగబోతోందని స్పష్టమవుతోంది.
ఈ కేసులో ఆయన సన్నిహితుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని ఏ-6గాను, అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని ఏ-7గాను సీబీఐ అనుబంద ఛార్జ్ షీట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
వివేకా వ్యక్తిగత కార్యదర్శి ఎంవీ కృష్ణారెడ్డిని, వంటమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్ ఇద్దరినీ అనుమానితులుగా పేర్కొంది. వారిలో ఎంవీ కృష్ణారెడ్డి తనను అనుమానితుల జాబితాలో నుంచి తొలగించి, బాధితుల జాబితాలో చేర్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా అందుకు నిరాకరించి తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోమని సూచించింది.
ఆ మద్య సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులుపంపడం, ఆయనను అరెస్ట్ చేస్తారంటూ హడావుడి తర్వాత ఈ కేసులో పురోగతి ఏమైనా ఉందంటే అది ఇది మాత్రమే.
నేటికీ నెల రోజుల తర్వాత అంటే ఆగస్ట్ 14న హాజరుకావాలని సీబీఐ కోర్టు నోటీస్ పంపడం చూస్తే సీబీఐ కూడా ఈ కేసు విషయంలో తొందరపడటం లేదని స్పష్టమైంది. కనుక ఈ కేసుని సీబీఐ ఓ కొలిక్కి తెచ్చేసిందని అనుకోవడం కూడా తొందరపాటే అవుతుంది.



