చంద్రబాబు, పవన్‌ నాన్చేస్తారా… తేల్చేస్తారా?

CBN PK

టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ ఆదివారం ఉండవల్లిలో సమావేశమయ్యి సీట్ల సర్దుబాట్లపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై పలుమార్లు చర్చించినందున ఇద్దరూ ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ సీట్లు అనే విషయంపై కొంత అవగాహనకు వచ్చారు. కనుక ఈరోజు సమావేశంలో ఇద్దరూ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం జనసేనకు 25 స్థానాలు చంద్రబాబు నాయుడు ఆఫర్ చేయగా, పవన్‌ కళ్యాణ్‌ మరి కొన్ని స్థానాలను పేర్కొని అవి కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలలో సీట్ల కోసం పవన్‌ కళ్యాణ్‌ పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

అందుకు చంద్రబాబు నాయుడు ఇదివరకే సానుకూలంగా స్పందించి, ఆ జిల్లాలలో టికెట్స్ ఆశిస్తున్న టిడిపి నేతలు త్యాగాలకు సిద్దంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పొత్తుల కోసం త్యాగాలు చేసిన వారందరికీ ఆధికారంలోకి రాగానే సముచిత గౌరవం, పదవులు ఇస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు.

ఓ వైపు జగన్మోహన్‌ రెడ్డి వరుసపెట్టి తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తుంటే, టిడిపి, జనసేనలు ప్రకటించలేకపోవడంతో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ల మీద విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉంది. ఇది రోజురోజుకీ పెరిగిపోతోంది.

కనుక నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు సీట్ల సర్దుబాట్లు ఓ కొలిక్కి వస్తే వెంటనే రెండు పార్టీలు కలిసి బహిరంగ సభ నిర్వహించి దానిలో ప్రకటించాలని భావిస్తున్నాయి. కానీ ఒత్తిళ్ళ కారణంగా ఇరుపార్టీలు వేర్వేరుగా ప్రకటించే అవకాశం కూడా ఉంది.

తాజాగా రైజ్ అనే సర్వే సంస్థ ఆంధ్రాలో సర్వే చేసి నివేదికను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాని ప్రకారం ఈసారి శాసనసభ ఎన్నికలలో టిడిపి, జనసేనలకు కలిపి 94 సీట్లు, వైసీపికి 46 సీట్లు (40.31 శాతంవస్తాయని, మరో 35 సీట్లలో వైసీపి-టిడిపి, జనసేనల కూటమి మద్య తీవ్రపోటీ ఉంటుంది.

అలాగే టిడిపికి 46.57శాతం, జనసేనకు 10.44 శాతం (మొత్తం 57.01 శాతం), వైసీపికి 40.31 శాతం, ఇతరులకు 2.68 శాతం ఓట్లు పడతాయని రైజ్ సర్వే వేదికలో పేర్కొంది.

ADVERTISEMENT
Latest Stories