సినీ, రాజకీయ మరే రంగానికి చెందిన సెలబ్రెటీలకైనా తిరుమలకి వెళ్తే వీఐపీ దర్శనాలు లభిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే రాచమర్యాదలు జరుగుతాయి. షాపింగ్ మాల్ ఓపెనింగ్కి వెళ్ళినా, ఎయిర్ పోర్టులో కనిపించినా వారిని చూసేందుకు జనం ఎగబడతారు.
వారు ఒక ట్వీట్ వేస్తే వైరల్ అవుతుంది. ఒక్క మాట మాట్లాడితే అది పట్టుకొని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు బ్రతికేస్తుంటాయి.
ఇక వారి విలాసవంతమైన ఇళ్ళు, జీవితాలు, సరదాలు చూసేందుకు కూడా జనం ఆసక్తి చూపుతుంటారు.
కానీ వారిని ద్వేషిస్తున్నవారు, వారికి కనపడని శత్రువులు కోకొల్లలు ఉంటారు. రాజమౌళి హనుమంతుడు గురించి ఒక్క మాట మాట్లాడితే అందరూ ఎలా రియాక్ట్ అయ్యారో చూశాము. కనుక ప్రతీ సెలబ్రెటీకి కనపడని శత్రువులు సిద్దంగా ఉంటారని స్పష్టమవుతుంది.
ఇందుకు తాజా ఉదాహరణగా, యాంకర్ శివజ్యోతి వివాదం గురించి చెప్పుకోవచ్చు. ఆమె ఇటీవల కుటుంబంతో కలిసి తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం లడ్డూ ప్రసాదం కౌంటర్ల క్యూ లైనులో నిలబడినప్పుడు, “స్వామివారి ప్రసాదం చాలా ఖరీదు. అంత ఖరీదైన ప్రసాదాన్ని అడ్డుకునే ఖరీదైన బిచ్చగాళ్ళం మేము,” అని అన్నారు. అప్పటి నుంచి ఆమెకు ట్రోలింగ్ మొదలైంది.
ఆమె సెలబ్రెటీ కనుక సోషల్ మీడియాలో ఇలాంటివి పట్టుకొని ట్రోల్లింగ్ చేయడం పరిపాటి. కనుక చేశారని అనుకోవచ్చు. లేదా ఇలాంటి అవకాశం కోసమే కాచుకు కూర్చున్న ఆమె శత్రువులు ఈవిదంగా బయటకు వచ్చి ఉండవచ్చు. కనుక ఆమె వెంటనే మనోభావాలు దెబ్బ తిన్నవారందరికీ క్షమాపణలు చెపుతూ ఓ వీడియో సందేశం సోషల్ మీడియాలో పెట్టారు.
కనుక సెలబ్రెటీలకు ప్రతీచోట ఏవిదంగా స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తుందో అదేవిధంగా నోరుజారితే వెంటనే ఇలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ కూడా లభిస్తుందన్న మాట!






