కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబందాలుంటే…

Centre-state relations impact: Andhra Pradesh development vs Telangana setbacks

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్య సత్సంబందాలుంటే రాష్ట్రాలు ఏవిధంగా లాభాపడాతాయో ఆంధ్రప్రదేశ్‌ని చూసి తెలుసుకోవచ్చు. సంబంధాలు సరిగా లేకపోతే ఏవిధంగా నష్టపోతాయో తెలంగాణ రాష్ట్రాన్ని చూసి తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పలు పరిశ్రమలు, కొత్తగా రోడ్, రైల్ మార్గాల నిర్మాణాలు, చకచకా సాగుతున్న కొత్త సీ పోర్టులు, ఎయిర్ పోర్టులు, అమరావతి బిల్లుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి.

ADVERTISEMENT

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో బిజేపి బలపడకుండా అడ్డుకునేందుకు, జాతీయస్థాయిలో తన స్థాయి పెంచుకొని జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు ప్రధాని మోడీపై కత్తులు దూసేవారు.

అందువల్ల ఆయన రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నారు. కూతురు కవిత ఢిల్లీ మద్యం కేసులో చిక్కుకొని జైలుకి వెళ్ళాల్సివచ్చింది. బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోయింది.

కేసీఆర్‌ చేసిన తప్పుల వలన కల్వకుంట్ల కుటుంబం, బీఆర్ఎస్‌ పార్టీ నష్టపోతే పోయారు. కానీ తెలంగాణ రాష్ట్రం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఉదాహరణకి వరంగల్‌ మామునూరు ఎయిర్ పోర్ట్ కోసం గత 12 ఏళ్ళుగా తెలంగాణ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. కానీ నేటికీ ఏర్పాటు కానేలేదు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదని, వివక్ష చూపుతోందని కేసీఆర్‌ అండ్ కో తరచూ విమర్శించడమే ఇందుకు నిదర్శనం. నేటికీ విభజన చట్టంలో పలు హామీలు అమలు చేయలేదని ఇటీవలే రాజ్యసభలో బీఆర్ఎస్‌ ఎంపీ సురేష్ రెడ్డి విమర్శించడం మరో నిదర్శనం.

కనుక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంపై కత్తులు దూస్తే తెలంగాణ రాష్ట్రంలా నష్టపోతాయని చెప్పక తప్పదు.

పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “మరో మూడు నెలల్లో వరంగల్‌ విమానాశ్రయానికి భూమిపూజ చేసి నిర్మాణ పనులు మొదలుపెడతాము,” అని చెప్పారు.

‘దేశ్ కీ నేత కేసీఆర్‌’ వల్ల సాధ్యం కాని ఈ పని బిజేపికి బద్ధ శత్రువైన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సిఎం రేవంత్ రెడ్డి వల్ల ఎలా సాధ్యమవుతోంది? అంటే పార్టీలు, రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో, ముఖ్యంగా ప్రధాని మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటం వల్లనే!

రాష్ట్రాల పట్ల కేంద్రం ఈవిధంగా వ్యవహరించడం జాతీయ స్పూర్తికి, ఫెడరల్ స్పూర్తికి విరుద్దం కదా?అనే సందేహం కలుగవచ్చు.

ప్రాంతీయ పార్టీలైనా, జాతీయ పార్టీలైన నడిపించేది రాజకీయ నాయకులే తప్ప రోబోట్లు కావు. కనుక కేంద్రంలో ఏ కూటమి అధికారంలో ఉన్నా, రాష్ట్రాలలో ఏ పార్టీలు, కూటములు అధికారంలో ఉన్నా వాటి ఆలోచనలు, నిర్ణయాలు, విధానాలలో తప్పనిసరిగా రాజకీయ కోణం ఉంటుంది.

ఈవిషయం అర్థం చేసుకున్న సిఎం చంద్రబాబు నాయుడు, సిఎం రేవంత్ రెడ్డి వంటివారు తెలివిగా రాష్ట్రాలకు రావాల్సినవి దక్కించుకుంటారు.

అపర చాణక్యులమని మిడిసిపడేవారి వల్ల వారి పార్టీలతో పాటు, రాష్ట్రాలు కూడా నష్టపోతుంటాయి. కనుక వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మెసులుకునే నాయకులే దేశానికి, రాష్ట్రాలకు చాలా అవసరం.

ADVERTISEMENT
Latest Stories