గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్లను నియమించి మంత్రులు, ఎమ్మెల్యేలకు పించన్లు, సంక్షేమ పధకాల సొమ్ముని ప్రజలకు పంపిణీ చేసే అవకాశం లేకుండా చేశారు. తద్వారా ప్రజలతో వారికి కనెక్షన్ కట్ చేశారు. అందుకు వారందరూ ఫలితం అనుభవిస్తున్నారిప్పుడు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులు, ఎమ్మెల్యేలనే స్వయంగా ప్రజలకు వాటిని అందించి వారి మెప్పు, అభిమానం పొందే అవకాశం కల్పిస్తున్నారు.
గతంలో రాష్ట్రంలో సంక్షేమ పధకాలే తప్ప అభివృద్ధి పనులు జరిగేవి కావు. కనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళేందుకు భయపడేవారు. కానీ ఇప్పుడు అటు తిరుపతి నుంఛి ఇటు శ్రీకాకుళం వరకు అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అనేక పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వస్తున్నాయి.
జగన్ కంటే మిన్నగా అనేక సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. కనుక టీడీపి మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయంగా ఎదగాలని పార్టీలో ఆరాటపడుతున్నవారు ప్రతీ ఒక్కరికీ ఇదొక అద్భుత అవకాశం.
ఇలాంటి అద్భుత అవకాశాన్ని జార విడుచుకున్నందుకే వైసీపీ నేతలు అధికారం కోల్పోయి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు కదా?
ఒకవేళ మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి టీడీపి, జనసేన పార్టీలలో చాలా మంది రాజకీయాల నుంచి రిటైర్ అవక తప్పదు. ఒకవేళ వారు విదేశాలకు పారిపోయినా ఒక్కొక్కడి కాలర్ పట్టుకొని లాకొచ్చి తాట తీస్తానని జగన్ హెచ్చరిస్తున్నారు. మరోపక్క వైసీపీ నేతలు కూడా “రప్పా రప్పా తలకాయలు నరికేస్తామని హెచ్చరిస్తున్నారు కదా?
కనుక టీడీపి, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో గెలవాలనే లక్ష్యంతో చురుకుగా పనిచేయాలి కదా?చేయకపోతే ఎవరికీ నష్టం?
కనుక సిఎం చంద్రబాబు నాయుడు, లేదా డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లేదా మంత్రి నారా లోకేష్ ఆదేశించారనో లేదా కోప్పడ్డారనో కాకుండా ఇదొక గొప్ప అవకాశమని గుర్తించి ప్రతీ ఒక్కరూ ప్రజల వద్దకు వెళ్ళడం మంచిది. లేకుంటే ఈసారి చేతులు కాలాక పట్టుకోవడానికి ఆకులు కూడా దొరకకపోవచ్చు.






