జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను అర్దాంతరంగా నిలిపివేయడం వలన జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. గత 5 ఏళ్ళుగా పనులు నిలిచిపోవడంతో ఇది వరకు పనులు చేసిన సంస్థలతో యధాతధంగా పనులు కొనసాగించడానికి సాంకేతిక, పాలనాపరమైన సమస్యలు ఎదురయ్యాయి. దీంతో 2014-2019లో జారీ చేసిన పాత టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్తగా టెండర్లు పిలవాల్సివస్తోంది.
సిఎం చంద్రబాబు నాయుడు నిన్న సచివాలయంలో సీఆర్డీఏ అధికారులతో సమావేశమైనప్పుడు ఈ టెండర్ల విషయంలో ఎదురవుతున్న పలు సమస్యలను వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అధిగమించేందుకు 23 సిఫార్సులతో కొత్త టెండర్లకు ప్రతిపాదనలకు సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే ఆమోదం తెలిపారు.
డిసెంబర్ నెలాఖరులోగా రాజధానిలో వివిద దశలలో ఉన్న అన్ని భవనాల నిర్మాణాలకు, రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలుస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో మూడేళ్ళలో ఈ పనులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.
కొండవీటివాగు, పాలవాగులతో రాజధానికి ముంపు సమస్య ఉంటుంది. కనుక 48.3 కిమీ పొడవునా కాలువలు నిర్మించేందుకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఆ నీటినే రాజధాని త్రాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.
ఇందుకోసం నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు వద్ద వరుసగా 0.04, 0.01,0.01 టీఎంసీల సామర్ధ్యం కలిగిన మూడు జలాశయాలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే లాం, పెదపరిమి, వైకుంఠపురం వద్ద 0.3,0.33,017 టీఎంసీల నీళ్ళు నిలువచేయగల మరో మూడు జలాశయాలు నిర్మించాలని నిర్ణయించారు.
ఈ వాగుల గుండా అదనంగా వచ్చే నీటిని ఎత్తిపోసేందుకు ఉండవల్లి, వైకుంఠపురం వద్ద రెండు పంప్ హౌస్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జలాశయాలు, పంప్ హౌస్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా రాజధాని, పరిసర ప్రాంతాలకు ముంపు బెడద శాశ్వితంగా తొలగిపోవడమే కాక, ఏడాది పొడవునా అమరావతి పరిసర ప్రాంతాలకు త్రాగు, సాగు నీరు లభిస్తుంటుంది.
అదే… జగన్ టిడిపితో రాజకీయాలను, చంద్రబాబు నాయుడుపై ద్వేషాన్ని పక్కన పెట్టి అమరావతి నిర్మాణ పనులను యధాతధంగా కొనసాగించి ఉండి ఉంటే ఆనాడు అనుకున్న అంచనాల ప్రకారమే పనులు జరిగి ఉండేవి. ఈ పాటికి అమరావతికి రూపు రేఖలు కూడా వచ్చి ఉండేవి. అది చూసి పెట్టుబడుదారులు ఏపీకి క్యూకట్టి ఉండేవారు. అమరావతి నిర్మించి, రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించినందుకు ప్రజలు మళ్ళీ జగన్కే పగ్గాలు అప్పగించేవారు.
కానీ జగన్ ఈ సువర్ణావకాశాన్ని చేజార్చుకుని తాను, తన పార్టీ నష్టపోవడం కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తీరని నష్టం కలిగించిన వ్యక్తిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అదే… చంద్రబాబు నాయుడు ఐదేళ్ళు అధికారం కోల్పోయినప్పటికీ అమరావతిని నిర్మించి రాష్ట్ర, దేశ చరిత్రలో శాశ్వితంగా నిలిచిపోయే అదృష్టం ఆయనకే దక్కింది. ఇది ఆయన పూర్వజన్మ సుకృతమే కదా?




