ప్రజాస్వామ్యం… పాఠ్య పుస్తకాలలో చదవడానికి, రాజకీయ నాయకుల నోట వినడానికి మాత్రమే ఈ పదం విరివిగా వాడబడుతుంది. ఆ మాటకొస్తే… ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నానుడి. అదే ప్రపంచమంతా ఢిల్లీలో “జీ 20 సదస్సు” పేరుతో ఏకమై మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడేలా చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దౌర్భాగ్య పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదేమో!?
ప్రజాస్వామ్యమా… ఇదెక్కడుంది? బహుశా ఏపీలో దీనికి తావు లేదేమో?! ఇప్పుడే కాదు, గత నాలుగు సంవత్సరాలుగా ఇదే జరుగుతోన్నా, ప్రస్తుతం ఆ “ప్రజాస్వామ్యపు అపహాస్యం” పతాక స్థాయికి చేరుకున్నట్లుగా కనపడుతోంది. ‘ఇల్లు ఉండగానే దీపం చక్కదిద్దుకోవాలి’ అనేది పెద్దల మాట. దీనినే ఏపీలో ఉన్న ప్రభుత్వం, ‘అధికారం ఉండగానే అన్నీ అనుభవించాలి’ అన్న తీరులో ప్రజాస్వామ్యపు బీటలు బద్దలు కొట్టేలా అడుగులు వేస్తోంది.
ఒకవైపు…. మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసిన విధానానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహా జ్వాలలు రగులుతుంటే, మరోవైపు ప్రతిపక్ష నాయకుడిని రాష్ట్రంలోకి రానివ్వకుండా అడ్డుకునే పరిస్థితులు ఏర్పడ్డాయంటే, భావితరాలకు “ప్రజాస్వామ్యం” గురించి ఏమని వివరిస్తున్నట్లు? రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే హక్కు ఏ రాజ్యాంగం కల్పించింది? ఏ న్యాయ శాస్త్రంలో పొందుపరచబడి ఉంది? ప్రతి సమస్యను ‘లా అండ్ ఆర్డర్’ పేరుతో ముడిపెట్టి చూస్తే, ఇంకా ప్రజలు అధికారం ఇచ్చింది ఎందుకు? కనీసం వాటిని కూడా నియంత్రించలేనంత దుర్భర స్థితిలో ఉన్నపుడు అధికారం ఎందుకోసం!?
బహుశా ఇలాంటి ప్రభుత్వాలు, ఇలాంటి రాజకీయ నాయకులు భవిష్యత్తులో భారతదేశంలో ఉత్పన్నం అవుతారన్న ఆలోచనలు నాడు దేశ రాజ్యాంగాన్ని రచించిన బి.ఆర్.అంబేద్కర్ గారికి స్పృశించలేదేమో?! లేదంటే అధికారం పేరుతో ఇలాంటి రాజకీయాలు చేసే నాయకులకు బుద్ధి చెప్పే విధంగా మరిన్ని సెక్షన్లను పొందుపరిచి ఉండేవారేమో? ప్రపంచమంతా ఇండియా వైపు చూస్తూ అభివృద్ధి పధంలో సాగుతుంటే, ఏపీలో మాత్రం కక్ష పూరితమైన చర్యలకు మాత్రమే అధికారాన్ని వినియోగించుకోవడం ఎంతవరకు సమంజసమో?!
అరెస్ట్ తప్పు కాదు… అవినీతి చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అనే విధంగా అరెస్ట్ లు ఉండాలి గానీ, అధికారం అడ్డం పెట్టుకుని కక్షపూరితమైన చర్యలకు పాల్పడే విధంగా ఉండరాదనేది ప్రజాస్వామ్యపు వాదుల మాట. నాడు 16 నెలల పాటు జైలులో ఎందుకు ఉన్నారు? స్వాతంత్య్ర పోరాటమో, మరే ప్రజానుకూల పోరాటమో చేసి కాదు కదా? ఐఏఎస్, ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన అధికారులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు కూడా జైలు జీవితాన్ని చవిచూసింది ఎవరి చలవనో అందరికి తెలిసిన విషయమే!?
అవినీతికి పాల్పడితే ఎంతటి వారికైనా చట్టం ఒకే విధంగా ఉంటుందని చెప్పేటందుకు నిదర్శనంగా నాడు అలాంటి సంఘటనలు మచ్చు తునకలు. బహుశా ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులలో కూడా నిజంగా అవినీతి జరిగిందని నిరూపణ అయితే, అందుకు అనుగుణంగా సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే ప్రజలు కూడా హర్షించేవారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అందుకు విరుద్ధంగా కనిపించడమే ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తును మరింత ప్రశ్నార్ధకం చేస్తోంది.
అరెస్ట్ చేసిన పార్టీ నేతలను బయటకు అడుగు పెట్టనివ్వకుండా గృహ నిర్బంధాలు… తన రాజకీయ పార్టీ కార్యాలయానికి వెళ్లనివ్వకుండా ప్రతిపక్ష నేతను రాష్ట్ర బోర్డర్ లోనే అడ్డుకోవడం… ఇవన్నీ దేనికి సంకేతాలు? ప్రజలకు ఎలాంటి సందేశాలను అందిస్తున్నట్లు? చేసిన తప్పును సరిదిద్దుకోవడం పరిణితి చెందిన రాజకీయ నాయకుడి లక్షణం, తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్లే రాజకీయ నాయకుడిని బహుశా “ఆర్ఆర్ఆర్” అయితే సరిగ్గా ఉదహరించగలరేమో?!
అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న ఆలోచనలు వస్తే ఇలాంటి చర్యలకు పాల్పడరేమో?



