జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టారు. జాతీయ స్థాయిలో మంచి పలుకుబడి, పరిచయాలు కలిగిన ఆ స్థాయి నాయకుడుని అరెస్ట్ చేస్తున్నప్పుడు కేంద్రం అనుమతి లేకుండా జగన్ చేయగలరనుకోలేము.
ఒకవేళ కేంద్రానికి తెలియకుండా హటాత్తుగా అరెస్ట్ చేశారనుకున్నా తర్వాత అయినా ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా ఖండించి ఉండాలి. తక్షణమే విడిచిపెట్టమని జగన్ ఆదేశించి ఉండాలి. కానీ వారిద్దరూ మౌనం వహించారు. అంటే వారి అంగీకారంతోనే చంద్రబాబు నాయుడుని జగన్ అరెస్ట్ చేసినట్లు భావించాల్సి ఉంటుంది.
ఇప్పుడు వారిరువురితో చంద్రబాబు నాయుడు, ఆయనతో వారిరువురూ చాలా సఖ్యతగా ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.
దేనికంటే కేంద్రానికి టీడీపి మద్దతు చాలా అవసరం కనుక అని అనుకోవచ్చు. లేదా చంద్రబాబు నాయుడు 55 రోజులు జైల్లో ఉండి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు కనుక ఉదారంగా క్షమించి ఉండవచ్చు. ఇప్పుడీ చర్చ అనవసరమే అప్రస్తుతమే.
కానీ చంద్రబాబు నాయుడు స్థాయి నాయకుడిని చేతికి మట్టి అంటకుండా జగన్ చేత అరెస్ట్ చేయించి జైలుకి పంపించిన కేంద్ర ప్రభుత్వం, ఆయనకు ఏవిధంగానూ సాటిరాని జగన్, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల విషయంలో చాలా ఉదారంగా వ్యవహరిస్తుండటమే ఆశ్చర్యం కలిగిస్తుంది.
జగన్పై 11 అక్రమాస్తుల కేసులు, ఏపీ మద్యం కేసు ఉన్నాయి. వివేకా హత్య కేసు విచారణ పూర్తయి ఉంటే దానిలో కూడా ఆయన పేరు ఉండేదే అని టీడీపి నేతలు చెపుతూనే ఉన్నారు.
ఇక కేసీఆర్ అండ్ కో మీద తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసుతో సహా పలు కేసులున్నాయి. కానీ వారిలో ఏ ఒక్కరినీ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కనీసం టచ్ చేయలేకపోతున్నాయి. ఎందువల్ల? అంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని సిఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్తూనే ఉన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు పట్ల అంత కటినంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం వారు నలుగురి పట్ల అంత ఉదారంగా ఎందుకు ఉంది?
అంటే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిల కంటే వీరు నలుగురే బిజేపి రాజకీయాలకు పావులుగా బాగా పనికొస్తారని కేంద్రం భావిస్తుండటమే కారణం కావచ్చు. లేదా వారిని చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలకు పక్కలో బల్లెంలా ఉంచడం అవసరమని భావిస్తుండవచ్చు. ఈవిధంగా కూడా ఏపీ, తెలంగాణ రాజకీయాలను, పార్టీలను కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ అందరినీ తన గుప్పెట్లో ఉంచుకొంటోందనిపిస్తోంది. అందుకే వారిని అరెస్ట్ చేసేందుకు కేంద్రం అనుమతించడం లేదనుకుంటే, ఈ విషయం వారికీ తెలుసు కనుక దాని ఆదేశం మేరకు కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇంట్లో నుంచి బయటకు రాకుండా, కేంద్రాన్ని విమర్శించకకుండా మౌనంగా కాలక్షేపం చేసేస్తున్నారు.. కదా?




