ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు నేడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పురోగతిని పరిశీలించారు. తర్వాత సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో పలు ప్రాజెక్టులను నేనే మొదలుపెట్టాను. హైదరాబాద్కు తాగునీటి సమస్య ఉంటే నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు రప్పించాను. హైటెక్ సిటీ నిర్మించి ఐటి కంపెనీలు రప్పించాను. యువతకు సాంకేతిక నైపుణ్యం అవసరమని గుర్తించి ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు చేయించాను.
తెలంగాణ, హైదరాబాద్ని అభివృద్ధి చేయడం నా బాధ్యతగానే భావించి చేశాను. కానీ ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రాలో ప్రాజెక్టులు నిర్మించుకుంటుంటే తెలంగాణలో పార్టీ నేతలు పోటాపోటీగా విమర్శిస్తున్నారు. కానీ నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించుకున్నప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు. నేటికీ ఎగువన ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా అభ్యంతరం చెప్పను.
ఏటా వర్షాకాలంలో, వరదలొచ్చినప్పుడు తెలంగాణలో అనేక జిల్లాలు నీట మునుగుతుంటాయి. ఆ వరద నీరు దిగువకు ప్రవహించి విజయవాడని ముంచెత్తుతూనే ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాల అవసరాలకు మించి గోదావరిలో నీళ్ళున్నాయి.
గోదావరి నీటిని ఎంతగా వాడుకున్నా ఇంకా నీళ్ళు సముద్రంలో కలుస్తూనే ఉన్నాయి. ఆ నీటిని రాయలసీమకు తరలిస్తుంటే తెలంగాణలో రాజకీయ నాయకులు అభ్యంతరాలు చెపుతున్నారు. మీ మద్య సాగే రాజకీయాలను మీరుమీరే తేల్చుకోవాలి. కానీ నీళ్ళతో కలపడం సబబు కాదు.
మేము దిగువన కృష్ణా గోదావరి నదులు అనుసంధానం చేసి, పోలవరం నుంచి రాయలసీమకు నీళ్ళు తీసుకువెళుతుంటే దానిలో నుంచి కూడా తెలంగాణ అవసరాలకు వాడుకోవచ్చు.
రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని ముందుకు సాగాలి కానీ రాజకీయాల కోసం నీళ్ళు, ప్రాజెక్టుళ పేరుతో గొడవ పడటం మంచిది కాదు,” అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
ఎగువనున్న తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంత బ్రాడ్ మైండ్తో ఆలోచించి మాట్లాడుతుంటే, బీఆర్ఎస్ పార్టీ తన మనుగడ కోసం నీళ్ళ రాజకీయాలు చేస్తోంది.
దానికి చెక్ పెట్టాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, దాని ఉచ్చులోనే చిక్కుకొని స్నేహహస్తం అందిస్తున్న చంద్రబాబు నాయుడుతో శత్రుత్వం కోరుకోవడం విజ్ఞత అనిపించుకుంటుందా?ఆలోచిస్తే బాగుంటుంది.






