టీడీపి ఎన్డీయేలో భాగస్వామి కనుక బహుశః బిజేపి అభ్యర్ధన మేరకు సిఎం చంద్రబాబు నాయుడు మిత్ర ధర్మం పాటిస్తూ నేడు కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాడు అన్నాడీఎంకే అధినేత, సిఎం ఎంజీఆర్, టీడీపి అధినేత, సమైక్య ఏపీ సిఎం ఎన్టీఆర్ స్నేహ సంబంధాలు గుర్తు చేసుకున్నారు. నాడు వారిరువురూ చొరవ వల్లనే ఏపీ నుంచి తెలుగు గంగ తమిళనాడుకి పారిందన్నారు.
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి ఏపీలో నీటి సమస్యని శాస్వితంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నామని, అదే విధంగా భవిష్యత్లో వాటితో కావేరి నది కూడా అనుసంధానం కావాలని కోరుకుంటున్నానని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
తమిళ ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేసే పార్టీల వలన ప్రజలకు ప్రయోజనం ఉండదని, దేశ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ఎన్డీయేనే తమిళనాడు రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కనుక ఈ నెల 23న జరుగబోయే ఎన్నికలలో అన్నాడీఎంకే-బిజేపి కూటమికి ఓట్లు వేసి గెలిపించాలని సిఎం చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులోని తెలుగు ప్రజలను కోరారు.
నేటికీ తెలంగాణలో టీడీపి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ రాష్ట్ర రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. అందరినీ కలుపుకుపోవాలనుకుంటారే తప్ప ఎవరితో శత్రుత్వం కోరుకోరు. తమిళనాడు రాజకీయాలలో వేలు పెట్టాలని అసలే అనుకోరు. కానీ మిత్రధర్మం పాటించి ఇలాంటి ఇబ్బందికరమైన పనులు చేయాల్సి వస్తుంటుంది.
నిజానికి డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉండి ఉంటే బహుశః ఆయనే తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్లి ఉండేవారు. కానీ రెండు రోజుల క్రితమే శస్త్ర చికిత్స చేయించుకున్నందున ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేకపోయారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వెళ్ళక తప్పలేదు. కానీ ఆయన అధికార అన్నాడీఎంకేని, సిఎం స్టాలిన్పై ఎటువంటి విమర్శలు చేయకుండా చాలా ఆచితూచి ప్రసంగించారు.
చంద్రబాబు నాయుడు తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారో డీఎంకే నేతలు, సిఎం స్టాలిన్ అర్థం చేసుకోగలరు. కనుక పట్టించుకోకపోవచ్చు. .




