శుక్రవారం నాడు సీఎం నివాసంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో… ఏపీ – తెలంగాణా రాష్ట్రాల మధ్య నలుగుతున్న పలు అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా 10వ షెడ్యూల్ ఆస్తులపై తెలంగాణ ప్రభుత్వం వైఖరి, ఢిల్లీలోని ఏపీ భవన్ అంశంతో పాటు నదీ జలాల వివాదాలు, విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అలాగే హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వం ఖాళీ చేసిన సచివాలయ భవనాలను తమకు అప్పగిస్తే తాత్కాలిక అవసరాల కోసం ఓ భవనాన్ని కేటాయించడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన భవన నిర్మాణం కోసం పదెకరాల స్థలాన్ని కేటాయిస్తామన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనపైనా పొలిట్ బ్యూరో విస్తృతంగా చర్చించింది.
హైదరాబాద్లోని ఏపీ సచివాలయ భవనాల స్థానంలో సాధ్యమైనంత త్వరగా కొత్త భవనాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు గవర్నర్ తెలిపిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించగా, తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై సభ్యులు కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. అపరిష్కృత అంశాలన్నింటిపైనా తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని పొలిట్ బ్యూరో సభ్యులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సిన అంశాలపై చర్చలు జరపడం ఉత్తమమన్న అభిప్రాయాన్ని పొలిట్ బ్యూరో వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు… “మనం విద్యుత్ సరఫరా చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు 4వేల కోట్ల బకాయిలు పడింది. వారు మనకు బొగ్గు సరఫరా చేసినందుకు తెలంగాణకు మనం 2వేల కోట్లు చెల్లించాలి. మనకు చెల్లించాల్సిన బకాయిల నుంచి వాటిని మినహాయించుకోమంటే వారు వినడం లేదు. బొగ్గు సరఫరా నిలిపివేశారు. మనం విద్యుత్ సరఫరా నిలిపివేశాం. కొన్ని విషయాల్లో ఇరు రాష్ట్రాల మధ్య ప్రతిష్ఠంభన ఉన్న మాట నిజమే. అయినా తెలంగాణతో సత్సంబంధాలు కొనసాగించడం అవసరం” అని సీఎం పేర్కొన్నారు.



