సాగునీటి ప్రాజెక్ట్ లకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు రికార్డ్ స్థాయిలో పట్టిసీమ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి తన ఉద్దేశం ఏమిటో చాటిచెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రాజెక్ట్ గా భావిస్తున్న పోలవరంపైనే అందరి కళ్ళు ఉన్నాయి. జాతీయ ప్రాజెక్ట్ గా మారిన పోలవరంకు కేంద్ర సహకారం అంతంత మాత్రమే ఉండడంతో ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
తాజాగా విజయవాడలో జరిగిన సమీక్షలో భాగంగా ఇక పోలవరం పనులు ఊపందుకోవాల్సిందేనని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఎట్టి పరిస్థితులలో 2018 నాటికల్లా ప్రాజెక్ట్ పూర్తి కావాల్సిందేనని ‘డెడ్ లైన్’ విధించారు. వారంలో ఒక గంట ప్రాజెక్ట్ వద్ద సమయం గడపడానికి కేటాయిస్తానని, అలాగే ప్రతి రోజు సమీక్ష జరుపుతానని చేసిన ప్రకటన అధికారుల్లో ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది.
పట్టిసీమ ఇచ్చిన ఉత్సాహం, ఊపు పోలవరంలో కూడా చూపాలని అధికారులకు దిశానిర్దేశం చేసారు చంద్రబాబు. దేశంలో నదుల అనుసంధానం చేసిన తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు, పట్టిసీమతో కృష్ణాడెల్టాను సశ్యశ్యామలం చేసారు. ఇదే ఊపులో పోలవరం ప్రాజెక్ట్ ని కూడా చంద్రబాబు పూర్తి చేసి ఏపీ భవిష్యత్తుని మారుస్తారని ఆశిద్దాం.



