తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నెలనెలా ఢిల్లీ వెళ్ళి వస్తూనే ఉంటారు. ఒక్కోసారి నెలకు రెండు మూడుసార్లు వెళ్ళివచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ పర్యటనలలో చాలా వరకు కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశాలే ఉంటాయి.
ప్రధాని మోడీ, కేంద్రం మంత్రులను అవసరం పడినప్పుడే కలుసస్తుంటారు. అందువల్లే కేటీఆర్ ఆయనని అందుకు ఎద్దేవా చేస్తుంటారు.
ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు తరచూ ఢిల్లీ వెళ్ళరు. కానీ వెళ్తే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకు వస్తుంటారు. నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ఈరోజు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ‘డిన్నర్ మీటింగ్’లో పాల్గొంటారు.
ఈ నెలాఖరు నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ తయారు చేస్తున్నప్పటికీ, దానిలో అమిత్ షా సూచనలు ఎప్పుడూ కీలకంగానే ఉంటాయి. కనుక బడ్జెట్లో ఏపీకి ఏయే రంగాలలో ఎంతెంత కేటాయింపులు అవసరమో నేడు డిన్నర్ మీటింగ్లో వివరించబోతున్నట్లు సమాచారం. కుదిరితే రేపు నిర్మలా సీతారామన్తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.
అయితే ఓ ముఖ్యమంత్రి కేంద్ర హోం మంత్రిని కేవలం బడ్జెట్ కోసమే భేటీ అవుతున్నారనుకోలేము. ‘రప్పారప్పా’ అంటూ రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న హడావుడి, కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం పిపిపి పద్దతిలో మెడికల్ కాలేజీలు నిర్మించబోతే వైసీపీ అడ్డుతగులుతుండటం, ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేవారిని జైలుకి పంపిస్తానని జగన్ బెదిరిస్తున్నారు.
రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి చేస్తున్న నీళ్ళ రాజకీయాలు వగైరాలన్నీ సిఎం చంద్రబాబు నాయుడు హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్ళి జగన్, కేసీఆర్లని కట్టడి చేయాల్సిందిగా కోరవచ్చు. లేదా ఆయన అనుమతిస్తే జగన్పై తగు చర్యలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేయవచ్చు. అవునో కాదో సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి తిరిగి వచ్చాక తెలుస్తుంది. కనుక కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేటి రాత్రి ‘డిన్నర్ మీటింగ్’ వైసీపీ జీర్ణించుకోవడం కొంచెం కష్టమే.






