ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ పాదయాత్ర పై ఏదైనా ఇంటలిజెన్స్ నివేదిక ఉందా? లేదా ఆయన ఉత్తుత్తి రాజకీయ విమర్శ ఏదైనా చేసారా? నిన్నటి రోజున జరిగిన కాబినెట్ సమావేశంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగన్ పాదయాత్ర సందర్భంగా తుని తరహా కుట్రలకు పాల్పడినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
‘‘జగన్ పాదయాత్రకు ఎవరూ అతిగా స్పందించవద్దు. మనం చేసిన పనులు ప్రజలకు చెబితే చాలు. వైకాపా మొదటి నుంచీ ఏదో ఒక కుట్రలో మనల్ని ఇరికించాలని చూస్తోంది. రేపు వాళ్లు తుని తరహా కుట్రలకు పాల్పడినా ఆశ్చర్యం లేదు. మళ్లీ నేరాలు చేస్తారా? చేయిస్తారా? గమనించాలి. పోలీసులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉండాలి.. ’’ అని చంద్రబాబు సూచించారు.
ఇది మాములుగా చేసిన రాజకీయ విమర్శా లేదా చంద్రబాబు వద్ద ఎమన్నా ఇంటలిజెన్స్ సమాచారం ఉందా అనేది తెలియాల్సి ఉంది. నిజంగా అలంటి సమాచారం ఉంటే మాత్రం అటువంటి సంఘటనలు ఆంధ్ర ప్రదేశ్ ఉన్న ప్రస్తుత పరిస్థితిలో ఎంత మాత్రం మంచిది కాదు. విభజన అనంతరం పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం చాల అగచాట్లు పడుతుంది.
ఇలాంటి సమయంలో అలంటి సంఘటన ఏదైనా జరిగితే పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి. మరో వైపు 6వ తారీఖు నుండి జగన్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. 6 నెలల పాటు 3600 కిలోమీటర్ల దూరం నడవాలని ఆయన ప్రణాళిక. ఈ ప్రక్రియలో ఆయన 120నియోజకవర్గాలను కవర్ చెయ్యబోతున్నారు. ఈ పాదయాత్ర ఆయనను ముఖ్యమంత్రి సింహాసనంలో కూర్చోబెడుతుందని జగన్ నమ్మకం. పాదయాత్ర తరువాత 50 నియోజకవర్గాలలో బస్సు యాత్ర కూడా చెయ్యబోతున్నారు.


