తండ్రి రాష్ట్రానికి మరమత్తులు చేసి మళ్ళీ గాడిన పెట్టి పరుగులు పెట్టిస్తుంటే, కొడుకు భ్రష్టు పట్టిన విద్యావ్యవస్థని ప్రక్షాళనం చేసి పదికి పది మార్కులతో పాస్ అయ్యాడు.
అలాగే తండ్రి పరిశ్రమలు రప్పిస్తుంటే, కొడుకు ఐటి కంపెనీలు రప్పిస్తుంటాడు. తండ్రి క్వాంటం కంప్యూటర్స్ అంటే కొడుకు గూగుల్-ఏఐ అంటాడు. ఇలా ప్రతీ విషయంలో పోటీ పడే ఆ తండ్రీ కొడుకులు ఎవరో ప్రత్యేకంగా చెప్పాలా?
నేడు మేడే సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా పమిడి ముక్కల గ్రామంలో ‘పేదల సేవ’ సభలో ప్రజల సమక్షంలోనే ఆయా శాఖల అధికారులను వివరణ అడిగారు. అలాగని ఎవరినీ అవమానించలేదు. ఒక్కొక్కరు ఆ పనుల పురోగతి, ఎప్పుటిలోగా పూర్తవుతాయో వివరించారు.
ఈ సందర్భంగా “నాకు తాన తందాన పాడేవాళ్ళు అవసరం లేదు. ప్రభుత్వానికి మంచి పేరు తేగలవారే కావాలి. మీ పనితీరు బాగుంటే ప్రజలు మాకు మంచి మార్కులు వేస్తారు. కనుక ప్రతీ ఒక్కరూ నిబద్దతతో పనిచేసి మీరూ మంచి పేరు తెచ్చుకోండి. మాకు మంచి పేరు వచ్చేలా చేయండి. రోడ్లపై గుంతలు పడితే ఆ విషయం నా వరకు రాకూడదు. అలాంటి సమస్యలు మీ స్థాయిలోనే పరిష్కరించబడాలి,” అని హితవు చెప్పారు.
సాధారణంగా ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది తానతందాన పాడే వాళ్ళనే ఇష్టపడతారు. ఇందుకు చక్కటి ఉదాహరణ మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డి.
నాడు ఆయన తప్పు మీద తప్పులు చేస్తూ చుట్టూ తానతందాన పాడే వాళ్ళనే ఏర్పాటు చేసుకున్నారు. చివరికి సొంత మీడియా కూడా ఆయనకు శల్య సారధ్యమే చేసింది తప్ప పిల్లి మెడ లో గంట కట్టలేదు. ఫలితం 11.
సరే అప్పుడంటే అందరి కళ్ళకు పదవి, అధికారమనే పొరలు కమ్మినందున మంచి చెడూ చూడలేకపోయారు. కానీ ఇప్పుడు 11కి పడిపోయినా ‘రప్పా రప్పా.. మావిగన్’ అంటుంటే, దానికి భజన బ్యాచ్ బాగానే వంత పాడుతోందంటే, అది వారి దురదృష్టమే…. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల అదృష్టమనే చెప్పాలి.
ఇటీవల నారా లోకేష్ ‘టీడీపి వర్కింగ్ ప్రెసిడెంట్’ ప్రమోషన్ పొందినప్పుడు, పార్టీలో సీనియర్ల పట్ల ఆయన చూపిన గౌరవం, ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరిని తాతా అంటూ ఆప్యాయంగా పలకరించి కాళ్ళకు నమస్కరించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని సాటి యువ నాయకులు కూడా నారా లోకేష్ని చూసి గ్రహింవచ్చు.
ఈవిధంగా తండ్రీకొడుకులు రాజకీయాలలో భజన బృందాలను ప్రోత్సహించకుండా, తప్పులు సరిదిద్దుకుంటూ పోటీ పడుతూ ప్రజలకు ఫలితాలు చూపుతుండటం అభినందనీయమే కదా?




