ఈ భేటీలు, పొత్తులు ఏమిటి… వద్దన్నా వినరా?

Chandrababu-Naidu-Pawan-Kalyan-Alliance

పిల్లికి చలగాటం ఎలక్కి ప్రాణసంకటం అన్నట్లు మారాయి టిడిపి, జనసేనల పొత్తులు. వాటిని దూరంగా ఉంచేందుకు సిఎం జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపిలో అందరూ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, మ్యారేజి స్టార్ అంటూ పవన్‌ కళ్యాణ్‌ని రెచ్చగొట్టి టిడిపికి దూరంగా ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ వారి ఉచ్చు చిక్కుకోలేదు.

రాష్ట్రంలో కాపుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు కాళ్ళ వద్ద పెడుతున్నారంటూ కులరాజకీయాలు కూడా ట్రై చేశారు. కానీ అవీ ఫలించలేదు. సింగిల్ సింహం… తోడేళ్ళ గుంపు అంటూ దమ్ముంటే టిడిపి, జనసేనలు వేర్వేరుగా 175 సీట్లలో పోటీ చేయాలని సవాళ్ళు విసిరారు. కానీ అవీ ఫలించలేదు.

ADVERTISEMENT

చివరికి జగన్‌ ముఖ్యమంత్రి హోదాని, హుందాతనాన్ని పక్కన పెట్టి పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి అవహేళనగా మాట్లాడుతూ మానసికంగా దెబ్బతీయాలని కూడా విశ్వప్రయత్నాలు చేశారు. ఈవిదంగా సామదానభేద దండోపాయాలన్నీ ప్రయోగించినా టిడిపి, జనసేనలను కలవకుండా ఆపలేకపోయారు.

దేవుడి స్క్రిప్ట్ ఎంత విచిత్రమైనదంటే, జగన్మోహన్‌ రెడ్డి ఏది వద్దని కోరుకొన్నారో సరిగ్గా దానిని ఆయన చేతే చేయించాడు. చంద్రబాబు నాయుడుని జగన్‌ అరెస్ట్ చేయించగానే పవన్‌ కళ్యాణ్‌ రాజమండ్రికి వచ్చి టిడిపితో పొత్తు పెట్టుకొని కలిసి ఎన్నికలలో పోటీ చేయబోతున్నామని ప్రకటించేశారు.

ఒకవేళ ఆరోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకపోయుంటే, తెలంగాణలో బీజేపీ, జనసేనల పొత్తులు, ఆ ఎన్నికల ప్రభావం, వైసీపి చేసే ప్రయత్నాల వలన టిడిపి, జనసేనల మద్య బహుశః నేటికీ పొత్తులు ఖరారు అయ్యేవి కావేమో? కనుక టిడిపి, జనసేనలను కలిపిన పుణ్యం జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని చెప్పక తప్పదు.

ఇప్పటికే రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నందున ఇప్పుడు కీలకమైన సీట్ల సర్దుబాట్లు, ఉమ్మడి మ్యానిఫెస్టో గురించి చర్చించేందుకు చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌ నిన్న హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాట్లు చాలా సున్నితమైన అంశం కనుక ఇరువురు దీనిపై లోతుగా చాలాసేపు చర్చించుకొన్నారు.

టిడిపి, జనసేనల బలాబలాలను బట్టి ఖచ్చితంగా గెలుస్తామనుకొనే సీట్లను మాత్రమే తీసుకోవాలని ఇరువురు నిర్ణయించారు. త్వరలో మరో రెండు, మూడుసార్లు సమావేశమయ్యి సంక్రాంతిలోగానే తేల్చేయాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారని మాజీ మంత్రి చిన్న రాజప్ప తెలిపారు.

టిడిపి, జనసేన అధినేతలు సీట్ల సర్దుబాట్ల చర్చలు మొదలుపెట్టడంతో వైసీపిలో మళ్ళీ కలవరం మొదలవుతుంది. కనుక వైసీపి బ్యాచ్ విమర్శలు, అవహేళనలు కూడా మొదలవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ జనసేనతో పొత్తులో ఉన్న ఏపీ బీజేపీ పరిస్థితి ఏమిటి?తెలంగాణ లోక్‌సభ ఎన్నికలలో జనసేనతో పొత్తుపెట్టుకోమని కిషన్ రెడ్డి చెప్పేశారు కనుక ఏపీలో కూడా జనసేనను వదులుకొంటుందా? లేక జనసేన కోసం టిడిపితో పొత్తుకి సిద్దం అవుతుందా? ఇదీ సంక్రాంతిలోగానే తేలిపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories