కేసీఆర్‌ కంటే నాయుడు విధానాలే మేలా?

chandrababu-kcr

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని ఆరాటపడిన కేసీఆర్‌ ప్రత్యేక విమానం వేసుకొని దేశాటన చేసి చాలా మందిని కలిశారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కారణాలు అందరికీ తెలుసు.

ఆ తర్వాత టిఆర్ఎస్‌ పార్టీని బిఆర్ఎస్ పార్టీగా మార్చేసుకొని ఏపీలోని తోట చంద్రశేఖర్, కర్ణాటకలోని కుమారస్వామి వంటి రాజకీయ నిరుద్యోగులను వెంటపెట్టుకొని ముందుకు సాగాలనుకున్నారు. కానీ అవీ ఫలించలేదు.

ADVERTISEMENT

కేసీఆర్‌ తన బృందాన్ని వెంటపెట్టుకొని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్ళి కుమారస్వామిని, ఆయన తండ్రి మాజీ ప్రధాని హెచ్‌డి దేవగౌడని కలిసి వచ్చారు.

కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని, కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చి వచ్చారు. కర్ణాటక శాసనసభ ఎన్నికలలో ఆర్ధికంగా సాయపడతారనే ఆశతో కుమారస్వామి కేసీఆర్‌ చుట్టూ తిరిగారు.

కానీ కీలకమైన ఎన్నికల సమయంలో కేసీఆర్‌ హ్యాండ్ ఇవ్వడంతో కుమారస్వామి ఓడిపోయారు. ఆ తర్వాత కుమారస్వామి ఎన్డీయే కూటమిలో చేరి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కాగా, కేసీఆర్‌ సొంత రాష్ట్రంలోనే వరుసగా శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ కుమారస్వామిని, హెచ్‌డి దేవగౌడని కలిసింది లేదు. కానీ ఇప్పుడు అదే కుమారస్వామి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విషయంలో చంద్రబాబు నాయుడుకి తోడ్పడేందుకు ముందుకు రావడం మరో విశేషం.

కేసీఆర్‌ని నమ్ముకున్నవారు… వారితో స్నేహం చేసిన కుమారస్వామి, ఉద్దవ్ థాక్రే (మహారాష్ట్ర) అర్వింద్ కేజ్రీవాల్‌ (ఢిల్లీ), హేమంత్ సొరేన్ (ఝార్ఖండ్) వంటి పలువురు నష్టపోయారు. స్వయంగా కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీ కూడా నష్టపోవడమే కాక ఆయన కూతురు కల్వకుంట్ల కవిత జైలు పాలైతే ఇంతవరకు విడిపించుకోలేకపోతున్నారు.

కానీ చంద్రబాబు నాయుడు వెంట సాగిన ప్రతీ ఒక్కరూ లాభపడుతూనే ఉన్నారు. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి వారికి కేంద్రమంత్రి పదవులు కూడా లభించడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు నాయుడు సానుకూల వైఖరి కారణంగానే ఇప్పుడు కుమారస్వామి కూడా ఏపీకి సాయపడేందుకు ముందుకు వస్తున్నారు.

కనుక తనను తాను గొప్ప మేధావిగా భావించుకుంటూ ఆంభావంతో వ్యవహరించే కేసీఆర్‌ కంటే, చంద్రబాబు నాయుడు రాజకీయ విధానమే సరైనదని, కాస్త ఆలస్యమైనా సత్ఫలితాలు ఇస్తుందని స్పష్టం అవుతోంది.

ADVERTISEMENT
Latest Stories