ఆవేశం అనర్ధాలకు దారితీస్తుంది, అణకువ అనుకూల ఫలితాలను ఇస్తుంది అంటూ పెద్దలు చెప్పిన మాటలు మనం వింటూనే ఉంటాం. పెద్దలు ఎంత అనుభవాన్ని చూసి ఉంటే ఇలాంటి మాటలు చెప్పి ఉంటారో కదా అనే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే సరిగ్గా మూడు రోజుల క్రితం విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చంద్రబాబు ని పొగడ్తలతో ముంచెత్తారు. రజినీ వ్యాఖ్యలతో వైసీపీ శిబిరంలో ఏదో తెలియని ఆందోళన కనబడినట్లయ్యింది. వైకాపా నేతలు ఒక్కొక్కరుగా రజిని వ్యాఖ్యలకు తీవ్రంగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇదంతా అందరికి తెలిసిన తంతే కదా మరి ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారా.. అసలు కిటుకు ఇక్కడే దాగి ఉంది.
పరుష పదజాలంతో నోటికి ఎంతమాట వస్తే అంతమాట అనేయడం, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీ నాయకుల కుటుంబ సభ్యులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ప్రభుత్వ తీరును విమర్శిస్తే తట్టుకోలేక ఇష్టం వచ్చినట్లుగా అక్రమ కేసులు పెట్టడం వైకాపా నాయకులకు అలవాటుగా మారిపోయిందని పదేపదే టీడీపీ నాయకులు చెప్తున్న మాటలు కూడా మనం వింటూనే ఉన్నాం.
వైకాపా నాయకుల తీరును నిసీతిగా గమనించిన టీడీపీ అధినేత బాబు ఓ భారీ స్కెచ్ వేశారట. విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న కొంతమంది నాయకుల తీరును కూడా టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబు భావించారట. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం కాకుండా, విమర్శలు చేసే వారిని వారి వేలుతో వారి కన్నే పొడుచుకునేట్లు చేయాలని బాబు గేమ్ స్టార్ట్ చేశారని, బాబు ఆడుతున్న గేమ్ తో వైసీపీ బిక్కబోర్లా పడ్డట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
ప్రజల నుండి టీడీపీకి అనుకూలంగా ఏ చిన్న వార్త వచ్చినా, మంచి స్పందన వచ్చినా ఓ రేంజ్ లో వైసీపీ నాయకులు విరుచుకుపడుతుంటారు. వారిలో ఈ వీరావేశాన్ని గమనించిన బాబు తన మేధస్సుని, అనుభవాన్ని ఉపయోగించి పక్కా ప్లాన్ తోనే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వ్యవహరించారు అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి.
రెండు కోణాల్లో ఆలోచించి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని బాబు ఆహ్వానించి ఉండొచ్చు అనే వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. రజినీకాంత్ బాబు కి ఆప్త మిత్రుడు కావడంతో పాటు రజిని ప్రసంగం వల్ల తెలుగు తమ్ముళ్లలో జోష్ నింపినట్లు అవుతుందని భావించడం, అదే విధంగా ఎన్టీఆర్ యొక్క స్ఫూర్తిని మరోసారి ప్రజలకు తెలియజేసినట్లు అవుతుందని భావించడం మొదటి కోణంగా చెప్తున్న పరిస్థితి.
ఇక రెండవ కోణంగా.. శతజయంతి ఉత్సవాల్లో సభను ఉద్దేశించి మరియు బాబుకి ఉన్న విజన్ గురించి ఖచ్చితంగా రజిని ప్రస్తావిస్తారని, ఇది చూసిన తరువాత వైసీపీ నాయకులు బీభత్సంగా రెచ్చిపోతారని బాబు ముందే భావించినట్లు కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. అయితే అంతా బాబు అనుకున్నట్లే జరిగిందట. రజిని బాబుని పొగుడుతూ ప్రసంగించడం, అది చూసి వైసీపీ నాయకులు రెచ్చిపోవడం, మంచి వ్యక్తిత్వం కలిగిన సూపర్ స్టార్ రజినీకాంత్ పైనే వైసీపీ నేతలు చాలా దారుణంగా వ్యవహరించడం పట్ల ప్రజల్లో ఒకింత చర్చ మొదలయ్యిందంట.
అసలు రజినీకాంత్ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారు అనే ప్రశ్న సామాన్యుల నుండి ఉత్పన్నమవుతున్న పరిస్థితి. రజిని ఆయనకు తెలిసిన వరకు బాబుని ఉద్దేశించి నాలుగు మంచి మాటలు మాట్లాడితే వైసీపీ నాయకులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని, రజిని లాంటి సౌమ్యుడి పైన ఇలా వ్యవహరించడం దారుణమనే వ్యాఖ్యలు పార్టీలతో సంబంధం లేకుండా వైసీపీ పై ఆగ్రహాన్ని, అసహనాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
రజినీకాంత్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేయడంతో తమిళనాడుతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజినీకాంత్ అభిమానులు మరియు కామన్ పబ్లిక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు చేయడం అంటే తిట్ల పురాణం అందుకోవడం కాదని, హుందాగా రాజకీయాలు చేయాలని, మంచిని మంచిగా చెడుని చెడుగా చెప్పేలా ఉండాలి కానీ , ఏమిలేని అంశాన్ని సైతం రాద్ధాంతం చేసేలా వ్యవహరించే ధోరణి వైసీపీ మార్చుకోవాలంటూ సామాన్య ప్రజలే విమర్శిస్తున్నారు.
రజినీకాంత్ ని ఎంత చులకనగా మాట్లాడారో, అంతకు వంద రెట్లు వైసీపీ ప్రజల్లో చులకన అయ్యిందని పబ్లిక్ అనుకుంటున్న పరిస్థితి. దీంతో రాష్ట్రం యొక్క అభివృద్ధిని గాలికి వదిలేసి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం, ప్రతిపక్షాలను బండ బూతులు తిట్టడం వంటివే పనిగా పెట్టుకున్నారని, ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరమా అనే వ్యతిరేకతను ప్రజలు బహిరంగంగానే వ్యక్తపరుస్తున్నారు.
ఏదిఏమైనా వైసీపీ నేతలు రజిని పై రెచ్చిపోతారని, తద్వారా వారి పరువే బజారున పడుతుందని గ్రహించిన బాబు ఊహే నిజమయ్యిందనే వ్యాఖ్యలు చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలే ప్రత్యక్షంగా తెలుసుకుంటారని బాబు అనుకున్నారని, అక్షరాల అదే జరిగిందని, రజిని పై అనవసర విమర్శలు చేసి వైసీపీ అభాసుపాలయ్యిందని, బాబు స్కెచ్ అదిరిందని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.



