ఒకప్పుడు రాయలసీమ జిల్లాలంటే తాగు, సాగు నీటికి కరువు… ఉద్యోగాలు, ఉపాధి లేక అందరూ వలసలు.. వీటికి తోడూ ఫ్యాక్షన్ రాజకీయాలు… ఒకటా రెండా… అనేక సమస్యలతో దశాబ్దాల పాటు సీమ జిల్లాల ప్రజలు నానా కష్టాలు అనుభవించారు.
కానీ ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగాల కావాలంటే రాయలసీమలో ఏ జిల్లాకు వెళ్ళినా చాలు. ప్రతీ జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులతో రకరకాల పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి.
కుప్పం నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఏబీఐఎస్ ప్రోటీన్స్, శ్రీజా ఇంటిగ్రేటెడ్ డెయిరీ అండ్ క్యాటిల్ ఫీడ్ ప్లాంట్, ఏస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డెయిరీ వంటి సంస్థలు ఏర్పాటవుతున్నాయి.
అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ రంగంలో ఈ-రాయిస్ ఈవీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో హిందాల్కో, ఇన్ ఫేజ్ పవర్ టెక్నాలజీస్ సంస్థలు ఏర్పాటవుతున్నాయి.
ఎన్పీఎస్పీఎల్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్, హ్వాసెంగ్ ఫుట్వేర్, టెక్స్టైల్ రంగంలో ఎంఏఎఫ్ క్లోతింగ్ వంటి చిన్నా పెద్ద, భారీ పరిశ్రమలు కుప్పం పరిసర ప్రాంతాలలో ఏర్పాటవుతున్నాయి.
శ్రీసత్యసాయి జిల్లాలో పుట్టపర్తిలో రూ.15,803 కోట్లు పెట్టుబడితో 650 ఎకరాలలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు (ఏఎంసీఏ) ఏర్పాటు కాబోతోంది. దీనిలో యుద్ధ విమానాలు, విడిభాగాలు తయారు చేస్తారు.
శ్రీసత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండలంలోని టేకులోడు వద్ద రూ.3,267.69 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాలలో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ సంస్థ సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటవుతోంది. రెండో దశలో మరో రూ.6,972.90 కోట్లు పెట్టుబడితో ప్లాంట్ విస్తరిస్తామని చెప్పారు. దీనిలో ప్రత్యక్షంగా 1,017 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.
ఇప్పటికే శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరో స్పేస్, డ్రోన్, డిఫెన్స్ రంగాలలో పెట్టుబడులు, పరిశ్రమలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. వాటి కోసం ప్రత్యేకంగా వేర్వేరుగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేసింది.
తిరుపతిలో స్పేస్ సిటీ (అంతరిక్ష రంగానికి చెందిన పరిశ్రమలు) వస్తున్నాయి. రేణిగుంటలో రూ.65,000 కోట్ల పెట్టుబడితో రిలయన్స్ సంస్థ 500 సీబీజీ ప్లాంట్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటిద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ. 1,622 కోట్ల పెట్టుబడితో 80 ఎకరాలలో రిలయన్స్ సంస్థ బెవరేజెస్, పళ్ళరసాలు, కూల్ డ్రింక్స్, త్రాగునీళ్ళు ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తోంది.
2026, డిసెంబర్ 31వ తేదీలోగా ఉత్పత్తి ప్రారంభం కాబోతున్న ఈ పరిశ్రమలో 1,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. దీని వలన కర్నూలుతో సహా చుట్టుపక్కల జిల్లాలలో వేలాదిమంది రైతులకు మేలు కలుగుతుంది. కర్నూలు జిల్లాలోనే డ్రోన్ సిటీ ఏర్పాటు కాబోతున్న సంగతి తెలిసిందే.
నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె వద్ద అటానమస్ మారి టైమ్ షిప్ యార్డు ఏర్పాటు కాబోతోంది. దీనిని ముంబయి కేంద్రంగా పనిచేసే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ నిర్మించబోతోంది. రూ.45 కోట్లు పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమ తొలిదశలోనే 750 మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది.
దీంతో పాటు అక్కడ నావికా దళానికి అవసరమైన ఇంటలిజెన్స్ మారి టైమ్ సిస్టమ్స్, కమాండ్ కంట్రోల్ సెంటర్స్లో వినియోగించి సాంకేతిక పరికరాలు తయారు చేసేందుకు అక్కడే సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ కంపెనీ (పరిశ్రమ) ఏర్పాటు కాబోతోంది.
భారత్, జపాన్ దేశాలకు చెందిన రెండు కంపెనీలు కలిసి ఓర్వకల్లులో రూ. 14,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నాయి.
ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా మరో 10,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి. ఓర్వకల్లు పారిశ్రామికవాడలోనే ‘నాచ్ కార్పొరేషన్’ రూ.1,035 కోట్ల పెట్టుబడితో ‘డక్ట్ ఐరన్ ప్లాంట్’ ఏర్పాటు చేయబోతోంది. దీనిలో కూడా సుమారు వెయ్యి మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభించనున్నాయి.
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్ళపల్లె, పెద్ద దండలూరు గ్రామాల మద్య 1100 ఎకరాలలో జేఎస్బ్ల్యూ సంస్థ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. మొదటిదశలో రూ. 4,500 కోట్లతో ఏడాదికి 10 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తుంది. రెండో దశలో మరో రూ. 11,850 కోట్లు పెట్టుబడితో మరో 2 మిలియన్ టన్నులు ఉత్పత్తి సామర్ధ్యంతో విస్తరిస్తుంది.
ఎట్టి పరిస్థితులలో 2029, ఏప్రిల్ నాటికి మొదటి దశ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నాయుడు ముందే గడువు విధించారు. మొదటిదశలో 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. పరోక్షంగా మరో 3-4,000 మందికి ఉపాధి లభిస్తుంది.
రెండో దశ నిర్మాణ పనులు 2034, ఏప్రిల్ నాటికి పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంటుంది. రెండో దశ ఉత్పత్తి మొదలైతే మరో 1,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి.
కనుక అటు చిత్తూరు నెల్లూరు నుంచి ఇటు కడప, కర్నూల్ వరకు వందలాది పరిశ్రమలు రాబోతున్నాయని స్పష్టమవుతోంది.
అలాగే ఉత్తరాంధ్రా జిల్లాలో భారీగా పరిశ్రమలు, పోర్టులు, ఐటి కంపెనీలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల నుంచి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా ఆంధ్రాకు వలసలు మొదలయ్యే అవకాశం ఉంది. కనుక ఉద్యోగాల కోసం ఆంధ్రా యువత వలసలు పోనవసరం లేదు. ఈ పరిశ్రమలలో ఉద్యోగాలకు తగిన విద్య, నైపుణ్యం సంపాదించుకుంటే చాలు. సీమ, ఉత్తరాంధ్రా జిల్లాలలోనే ఉద్యోగాలు లభిస్తాయి.





