నేడు అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో రూ.10,000 కోట్లతో సుజ్లాన్ పవన విద్యుత్ ప్రాజెక్టుని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభిస్తున్నారు.
రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేస్తున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడితో ఆగిపోతుంటారు. కానీ అక్కడితో ఆగిపోతే వారికీ సిఎం చంద్రబాబు నాయుడుకి తేడా ఏముంటుంది?
సుజ్లాన్ పవన విద్యుత్ ప్లాంటుతో పాటు వీటి కోసం అవసరమైన బ్లేడ్స్ తయారు చేసే పరిశ్రమని కూడా సిఎం చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయించారు.
కణేకల్లు మండలం హులికెర గ్రామంలో ఏర్పాటు చేసిన ‘ఎస్-144 విండ్ మిల్స్ బ్లేడ్స్’ తయారుచేసే పరిశ్రమలో ‘ప్రొడక్షన్ లైన్’ని మంత్రి నారా లోకేశ్ నేడు అధికారికంగా ప్రారంభిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే 1,700 మెగావాట్లకు పైగా పవన విద్యుత్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న సుజ్లాన్, 2030 నాటికి రాష్ట్రంలో మరో 5 గిగావాట్ల (GW) హరిత ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అనంతపురం జిల్లాలోనే టాటా పవర్, వాణీ ఎనర్జీ వంటి భాగస్వామ్యాలతో రాయదుర్గంలో 1,325 మెగావాట్ల (MW) సామర్థ్యంతో ఈ విండ్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
కనుక ఈ రంగంలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఉరవకొండ, విజయవాడలలో గ్రీన్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్లను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం వాటిలో సుమారు 12,000 మంది శిక్షణ పొందుతున్నారు కూడా.
సుమారు మూడున్నర దశాబ్దాల క్రితం ఐటి రంగం భవిష్యత్లో కీలకంగా మారుతుందని ముందే గ్రహించిన సిఎం చంద్రబాబు నాయుడు, అప్పుడూ ఇలాగే ఐటి కంపెనీలను రప్పించి, ఇంజనీరింగ్ కాలేజీలను వాటిలో సాఫ్ట్వేర్ కోర్సులను ప్రోత్సహించారు.
ఇప్పుడు ఈ రంగంలో ఏపీతో సహా దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవకాశాలను ముందే గుర్తించి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే సిఎం చంద్రబాబు నాయుడు ‘విజనరీ’ అని ప్రముఖులు ప్రశంశిస్తుంటారు!





