విజయవాడ నోవాటెల్లో బుధవారం ఫిక్కీ సమావేశం జరిగింది. దీనిలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “వైసీపీ హయంలో మీరందరూ చాలా చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. మళ్ళీ ఇకపై ఎన్నడూ అటువంటి పరిస్థితి రానీయనని మీకు హామీ ఇస్తున్నాను. రాష్ట్రంలో మా ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేందుకు ‘అన్ని జాగ్రత్తలు’ తీసుకుంటున్నాను.
కనుక గత చేదు అనుభవాలను విస్మరించి రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టండి. వాటికి నేను భరోసా ఇస్తున్నాను,” అని అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ దయనీయ పరిస్థితిలో ఉన్నా కూడా సిఎం చంద్రబాబు నాయుడుని చూసి రాష్ట్రంలో భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టారు.
కానీ ఇప్పుడు ‘జగన్ ఫోబియా’ భయపడుతున్న పారిశ్రామికవేత్తల చేత పెట్టుబడులు పెట్టించడం కంటే, వారిలో జగన్ అంటే భయం పోగొట్టడమే సిఎం చంద్రబాబు నాయుడుకి పెద్ద పనైపోయింది. ఎందువల్ల అంటే జగన్ చెపుతున్న మాటలు.. రాష్ట్రంలో ఆయన చేస్తున్న హడావుడే కారణం.
“కళ్ళు మూసి తెరిచేలోగా ఇట్టే 5 ఏళ్ళు గడిచిపోతాయి.. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము. ఈసారి 20-30 ఏళ్ళు మనమే అధికారంలో కొనసాగుతాము,” అని వైసీపీ అధినేత జగన్ చాలా నమ్మకంగా, గట్టిగా తమ నేతలకు చెపుతుంటారు.
175/175 తేడా కొట్టినా నేటికీ వారందరూ జగన్ని నమ్ముకునే ఉన్నారు. ఎందువల్ల అంటే ఏదో విదంగా జగన్ వైసీపీని గెలిపిస్తారని, మళ్ళీ అధికారం అనుభవిస్తామనే నమ్మకం ఉండటం వల్లనే.
అందుకే మొదట్లో కూటమి ప్రభుత్వాన్ని చూసి భయంతో గజగజ వణికిపోయిన వైసీపీ నేతలు ఇప్పుడు కేసులకు భయపడకుండా జగన్ ఒక్క పిలుపు ఇస్తే రోడ్లపైకి వచ్చి కూటమి ప్రభుత్వంతో యుద్ధానికి సిద్దమవుతున్నారు.
జగన్ ప్యాలస్లో నుంచి బయటకు రాకుండా వారికి అంత నమ్మకం, ధైర్యం కలిగించడం మామూలు విషయం కానే కాదు. ఒకవేళ జగన్ ప్రజల మద్యకు వస్తే ఏవిదంగా ఉంటుందో పొదిలి, రెంటపాళ్ళ పర్యటనలతో రుచి చూపించారు.
రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఇవన్నీ నిశితంగా గమనిస్తూనే ఉంటారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి రాష్ట్రంలో వందలు, వేలకోట్లు పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి పదిసార్లు తప్పక ఆలోచిస్తారని వేరే చెప్పక్కరలేదు.
కనుక మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందనే నమ్మకం కల్పించాలంటే సిఎం చంద్రబాబు నాయుడుతో కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరూ జగన్ కంటే గట్టిగా, నమ్మకంగా ఈ మాట చెప్పడం చాలా అవసరం.
అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని నిరూపించేందుకు జగన్, వైసీపీ చేస్తున్న కుట్రలని ఉక్కుపాదంతో అణచివేయడం చాలా ముఖ్యం.
జగన్ విషయంలో నేటికీ కూటమిలో బీజేపి మంత్రులు, ఏపీ బీజేపి నేతలు చాలా మెతక వైఖరి ప్రదర్శిస్తూ తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని చెప్పక తప్పదు. పురందేశ్వరి మాత్రమే కాకుండా ఏపీ బీజేపి నేతలందరూ జగన్, వైసీపీలని గట్టిగా ఎదుర్కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
వీలైతే ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులని రాష్ట్రానికి రప్పించి వారిచేత రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడించి, రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని గట్టిగా చెప్పించగలిగితే పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలుగుతుంది. అప్పుడే రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి.




