చిత్తూరు జిల్లా నగరి మంత్రి ఆర్కె. రోజా నియోజకవర్గం. నగరిని తన కంచుకోట అని ఆమె భావిస్తుంటారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆమె కంచుకోటలోనే ప్రవేశించి బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.
వైసీపీకి, ముఖ్యంగా మంత్రి రోజాకు ఎంతో పట్టున్న నగరిలో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహిస్తే ఇసుకవేస్తే రాలనంత జనం తరలివచ్చారు. ఇక టిడిపి నేతల, కార్యకర్తల హడావుడి సరేసరి. ఊరంతా టిడిపి జెండాలు, చంద్రబాబు నాయుడు ఫోటోలున్న బ్యానర్లతో నింపేశారు.
ఆయనకు ఘనస్వాగతం పలికి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు నగరి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “మీరు ఇదివరకు మున్సిపల్ టాక్స్ మాత్రమే చెల్లించేవారు. కానీ ఇప్పుడు జగన్ టాక్స్, ఎమ్మెల్యే టాక్స్, మంత్రుల టాక్స్ చెల్లించాల్సి వస్తోంది. ఏవిదంగా అంటే నగరిలో ఒక కాలువ తవ్వించాలన్నా, రోడ్డు వేయాలన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు కలిపి కమీషన్లు బొక్కేస్తుంటారు.
ఒక్కో పనికి ఒక్కొక్కరికీ 10 శాతం, 15 శాతం అంటూ కమీషన్లు ఫిక్స్ చేసుకొని వసూలు చేసుకొంటుంటారు. దీంతో లక్ష రూపాయలతో పూర్తవలసిన పని వారి కమీషన్లతో కలిపి ఏ రెండు మూడు లక్షలకో వెళ్ళిపోతుంది. అదంతా ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు చెల్లిస్తున్నారు? అంటే అది మీరే. విద్యుత్, ఆర్టీసీ, ఇంటి పన్ను వగైరాల ఛార్జీలు పెంచేసి పిండేసుకొంటోంది ఈ జగన్ ప్రభుత్వం.
ఇలాంటి ప్రభుత్వం మరో 20-30 ఏళ్ళు ఉండాలని వైసీపీ నేతలు చెపుతున్నారు. మీరు నెత్తి మీద ఈ వైసీపీ కుంపటి ఇంకా ఉండాలని కోరుకొంటున్నారా?అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించగా ప్రజలు ‘వద్దూ… వద్దూ..” అంటూ బిగ్గరగా సమాధానం చెప్పారు. అప్పుడు వారిచేత చంద్రబాబు నాయుడు ‘క్విట్ జగన్… క్విట్ జగన్…’ అంటూ నినాదాలు చేయించారు. అయితే ఈ నినాదాలతో వైసీపీని వదిలించుకోలేమని, ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాని కోసం మీ గడప గడపకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలను గట్టిగా నిలదీయాలని చంద్రబాబు నాయుడు చెప్పారు.
అంతకు మును పుంగనూరులో పర్యటించి స్థానిక టిడిపి నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీలో నేతలందరూ వర్గాలుగా విడిపోయి కీచులాడుకొంటుంటే చివరికి మనమే నష్టపోతామని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. పార్టీకి ఎవరు నష్టం కలిగిస్తున్నా ఉపేక్షించబోనని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో పుంగనూరు నుంచి చల్లబాబు పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తారని కనుక నియోజకవర్గంలో టిడిపి నేతలు కార్యకర్తలు అందరూ ఆయనకు సహకరించాలని చెప్పారు.



