సిఎం చంద్రబాబు నాయుడు కుటుంబం ఆనవాయితీ ప్రకారం సంక్రాంతి వేడుకలు జరుపుకోవడానికి తమ సొంతూరు నారావారిపల్లెకు చేరుకున్నారు. స్థానిక ప్రజలతో కలిసి వారు సంక్రాంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ వేడుకలలో భాగంగా రెండు ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి.
కోలాటం ఆడేందుకు వచ్చిన అమ్మాయిలు సిఎం చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగుతుండగా సమీపంలోనే ఉన్న ఆయన సతీమణి వారి వద్దకు వచ్చి ఓ అమ్మాయిని పలకరించి “అప్పుడే ఇంత పెద్దదానివైపోయావే…” అంటూ ఆప్యాయంగా కౌగలించుకొని ఆమె కూడా వారితో ఫోటో దిగారు.
చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల మద్య ఎంత బలమైన సంబంధం ఉంటుందో పలు సందర్భాలలో ప్రజలందరూ చూస్తూనే ఉంటారు. అలాగే తమ ఊర్లో వారితో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అంతే ఆత్మీయంగా వ్యవహరిస్తుంటారు.
చంద్రబాబు నాయుడు కుటుంబంలో అందరూ క్షణం తీరిక లేని జీవితాలు గడుపుతున్నా ఇంతమందితో సత్సంబంధాలు ఎలా నెరపగలుగుతున్నారు?వారితో పోలిస్తే ఇంత పనిభారం, ఒత్తిళ్ళు లేని జీవితాలు గడుపుతున్న సామాన్య ప్రజలు ఎందుకు బంధుత్వాలకు, స్నేహాలకు క్రమంగా దూరమైపోతున్నారు?ఎవరికీ వారు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఆస్తులు, రాజకీయాల కోసం కీచులాడుకుంటున్న జగన్-షర్మిల, కేటీఆర్-కవితలు ఆలోచించాలి.
నేడు నారావారిపల్లెలో జరుగుతున్న వేడుకలలో భాగంగా చిన్న పిల్లలకు ‘మ్యూజికల్ చైర్ ఆట’లో సిఎం చంద్రబాబు నాయుడు మనుమడు దేవాన్ష్ కూడా పాల్గొన్నాడు. అతను కూడా మిగిలిన పిల్లలతో బాటు యూనిఫారం ధరించి ఈ ఆటలో పాల్గొన్నాడు. అయితే రెండో రౌండులోనే అవుటయ్యిపోయాడు.
మనుమడు రెండో రౌండులోనే అవుటయ్యి పక్కకు తప్పుకుంటే అక్కడే ఉన్న సిఎం చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి చిరునవ్వుతో మిగిలినవారిని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి దంపతులు ఇంత హుందాగా వ్యవహరించడం, బేషజాలు తెలీని వారి మనుమడు దేవాన్ష్ సాటి పిల్లలతో కలిసి ఆడుకోవడం చూడముచ్చటగా ఉంది… కదా?






