చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇద్దరిలో జగన్ యువకుడు, విదేశాలలో ఉన్నత విద్యలభ్యసించినవారు. భారీ మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పూర్తి 5 ఏళ్ళు తిరుగేలేదన్నట్లు పాలన చేశారు కూడా.
కానీ చంద్రబాబు నాయుడు 74 ఏళ్ళ వృద్ధుడు. జగన్ కంటే రాజకీయ, పరిపాలన అనుభవం ఎక్కువ ఉండవచ్చు. కానీ రాష్ట్ర విభజన తర్వాత, జగన్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ముందు అన్నీ సమస్యలు సవాళ్ళే.
జగన్ యువకుడు కనుక సరికొత్త ఆలోచనలు, విధానాలతో చాలా చురుకుగా పాలన చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని అందరూ ఆశించారు. కానీ ఏం చేశారో అందరూ చూశారు.
కానీ వృద్ధుడని జగన్ ఎగతాళి చేసిన చంద్రబాబు నాయుడే యువకుడిలా చురుకుగా ఆలోచిస్తూ చకచకా అన్ని చక్కబెడుతుండటం విశేషం. కర్నూలు జిల్లాలో ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఆయన దూరదృష్టికి నిదర్శనమనుకోవచ్చు.
తాజాగా దక్షిణాది రాష్ట్రాలలో తొలిసారిగా ఆంధ్రాలో సీ-ప్లేన్ సర్వీసులు ప్రారంభించబోతున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సీ-ప్లేన్ సర్వీసులను విజయవాడలో సిఎం చంద్రబాబు నాయుడు ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారు.
వీటి కోసం విజయవాడ కృష్ణానది పున్నమి ఘాట్ వద్ద ప్రత్యేకంగా ఓ జెట్టీ ఏర్పాటు చేశారు. మొదట ప్రయోగాత్మకంగా విజయవాడ-శ్రీశైలం మద్య ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాజమండ్రి, విశాఖకు ఈ సేవలు విస్తరించనున్నారు. ముందుగా సిఎం చంద్రబాబు నాయుడు తదితరులు ఈ సీ-ప్లేన్లోనే విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళివచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నీటి మీద ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సీ-ప్లేన్ సర్వీసులను పౌరవిమానయాన శాఖ, రాష్ట్ర పర్యాటక శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థలు కలిసి నిర్వహించనున్నాయి.
చంద్రబాబు నాయుడు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ సీ-ప్లేన్ సర్వీసులు ప్రారంభించాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన సాధ్యపడలేదు. జగన్కి ఇటువంటి ఆలోచన కూడా కలగలేదు. కలగనప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు అనుకున్న ఈ సీ-ప్లేన్ సర్వీసులను ప్రారంభించి ఉండవచ్చు. కానీ అదీ చేయలేకపోయారు. కానీ చంద్రబాబు నాయుడు అప్పుడు అనుకున్న ఈ పనిని ఇప్పుడు ముఖ్యమంత్రి కాగానే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడుకి, జగన్కి ఇదే తేడా!




