టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించి వరద బాధితలను పరామర్శించనున్నారు. ఈరోజు ఉదయం గుంటూరు నుంచి బయలుదేరి పి.గన్నవరం మండలంలోని రాజోలు, నాగుల్లంక, మనేపల్లి గ్రామాలలో, మామిడికుదురు మండలంలోని అప్పనాపల్లి గ్రామాలలో సాయంత్రం 5 గంటల వరకు పర్యటించి వరద బాధితులతో ముఖాముఖీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొనున్నారు.
చంద్రబాబు నాయుడు బోటులో ప్రయాణించి ముంపు ప్రాంతాలకు చేరుకోనున్నారు. బాధితులను పరామర్శించడంతో పాటు తెలుగు దేశం పార్టీ తరపున వారికి నిత్యావసర సరుకులు, ఆర్ధికసాయం అందించబోతున్నట్లు తెలుస్తోంది. రేపు పశ్చిమగోదావరి జిల్లాలో వరద ముంపు గ్రామాలలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు.
ఈ సందర్భంగా టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పార్టీ నేతలకు ట్విట్టర్లో ఓ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పర్యటనకు వస్తున్న మన అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పూలదండలు, బొకేలు, ఫ్లెక్సీ బ్యానర్లతో స్వాగతం పలికే బదులు ఈసారికి బియ్యం ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు,నిత్యావసర సరుకులు, దుప్పట్లు తీసుకువచ్చి స్వాగతం పలకాలి. వాటిని చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వరద బాధితులకు అందజేద్దాము,” అని లని విజ్ఞప్తి చేస్తున్నాను.
చంద్రబాబు నాయుడు ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులను పరామర్శించడంపై ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, “చంద్రబాబు నాయుడు వరద బాధితులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టేందుకే ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన వలన సహాయచర్యలకు ఆటంకం ఏర్పతుంది. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి ఎంత చేయాలో అంతకంటే చాలా ఎక్కువే చేస్తోంది. కనుక చంద్రబాబు నాయుడు పర్యటన విరమించుకొంటే మంచిది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో కూడా చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం సరికాదు,” అని అన్నారు.



