అచ్యుతాపురం విషాద ఘటనపై ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చకచకా జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో పర్యటించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, బాధితుల కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చెక్కులు అందజేశారు. ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.
జగన్ అధికారంలో ఉన్నా ఇదే చేసేవారు. కానీ టిడిపి కూటమి ప్రభుత్వం ఇంతవేగంగా స్పందిస్తున్నా వైసీపి శవరాజకీయాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం.
ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో సాగునీటిశాఖ మంత్రిగా పనిచేసి పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలీదని, పోలవరం గురించి నాకు అవగాహన లేదని ధైర్యంగా చెప్పగలిగిన ఘనుడు అంబటి రాంబాబు. ఆయన కూడా ఈ విషాద ఘటనపై కోడిగుడ్డుకి ఈకలు పీకుతున్నట్లు మాట్లాడుతుండటం చాలా శోచనీయం.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలని వక్రీకరిస్తూ విమర్శలు గుప్పించడం సిగ్గుచేటు. ఇంతకీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే…
తన ఫార్మా ఎసెన్షియా కంపెనీలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా అమెరికాలో ఉన్న దాని యజమాని రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కంపెనీలో భాగస్వాముల మద్య విభేధాలున్నట్లు తెలిసింది. పరిశ్రమ నిర్వహణపై బహుశః ఆ ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు.
పరిశ్రమలు, పెట్టుబడులను మేము ఆహ్వానిస్తున్నాము కదాని భద్రతా ప్రమాణాలు పాటించకుండా నడిపిస్తామంటే కుదరదు. ముఖ్యంగా రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలన్నీ ఖచ్చితంగాభద్రతా ప్రమాణాలు పాటించాలి. ప్రభుత్వం తరపున ఎలాగూ భద్రత, కాలుష్యంపై ఆడిట్ (తనికీలు, సిఫార్సులు, నివేదికలు, చర్యలు) ఉంటుంది.
పరిశ్రమలను నడుపుతున్నవారు కూడా ఎవరికి వారు బాధ్యత తీసుకొని ఎప్పటికప్పుడు భద్రత, కాలుష్యాలపై అంతర్గతంగా పరిశీలించుకుంటూ తగిన ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకోవాలి,” అని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, “ఇలా తరచూ ఏదో ఓ పరిశ్రమలో ప్రమాదం జరగడం, కార్మికులు ప్రాణాలు కోల్పోతుండటం మనసుని చాలా కలచివేస్తుంది. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వగలదు. కానీ అది పోయినవారి లోటుని తీర్చలేదు.
కనుక భద్రత, కాలుష్యంపై ఎప్పటికీ అప్పుడు ఆడిట్ తీసుకోవడం చాలా అవసరం. ఈ అంశంపై కూడా మేము చర్చించి పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపడతాం,” అని అన్నారు.
దీనిపై అంబటి రాంబాబు ఏమన్నారంటే, “పరిశ్రమలో ప్రమాదం జరిగితే దానికి భాగస్వాముల మద్య విభేధాలే కారణమట! ఆ పరిశ్రమ యజమాని విదేశాలలో ఉన్నాడని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెపుతుండటం సిగ్గుచేటు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయని పవన్ కళ్యాణ్ చెపుతున్నారు. అంటే ప్రభుత్వానికి కార్మికుల భద్రత పట్టదా?
కోటి రూపాయలు ఇస్తే తప్ప శవాలను తీసుకువెళ్ళమని బాధితులు ధర్నా చేశారు. ఎందుకంటే వారికి చంద్రబాబు నాయుడు మాతపై నమ్మకం లేదు కనుక. తప్పనిసరి పరిస్థితిలో అతికష్టం మీద కోటి రూపాయల చెక్కులు ఇచ్చారు తప్ప జగన్లాగా మానవతా దృక్పధంతో ఆలోచించి ఇవ్వలేదు,” అంటూ వెగటు పుట్టించే మాటలు ఇంకా చాలానే మాట్లాడారు.
బాధితులను ఓదార్చేందుకు నేడు జగన్ విశాఖ రాబోతున్నారు. ఆయన డ్రామా ఇంకెలా ఉంటుందో?




