గతంలోలా ఇప్పుడు కేవలం పాలన చేస్తాం. హామీలు అమలుచేస్తాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటే సరిపోదు. తప్పనిసరిగా ప్రతిపక్షాలను కాసుకుంటూ ముందుకు సాగాలి. లేకుంటే పడవకి కన్నం పడిందని సముద్రం మధ్యకి వెళ్ళాక చూసుకుని గాబరా పడినట్లే ఉంటుంది.
ఈరోజు సిఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఇదే చెప్పారు. వైసీపీ హటాత్తుగా మావిగన్ పాట మొదలుపెట్టి ఆపేసింది కానీ అమరావతిపై దుష్ప్రచారం మాత్రం ఆపలేదన్నారు.
అలాగే టమాటాలు, ఉల్లిపాయలు ధరలు పెరిగినా, పెట్రోల్ డీజిల్ దొరక్కపోయినా వైసీపీ వెంటనే రంగంలో దిగి దుష్ప్రచారం మొదలు పెట్టేస్తోంది. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించడం లేదని, దీని వలన వైసీపీ దుష్ప్రచారాన్నే ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుందన్నారు. కనుక వైసీపీ దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూనే ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడు సూచించారు.
అంటే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, మంచి పనులు చెప్పుకున్నా లేకున్నా తప్పనిసరిగా వైసీపీ దుష్ప్రచారాలని తిప్పి కొడుతూనే ఉండాలన్న మాట!
ఇలాంటి పరిస్థితిని చూసే డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఓ మాటన్నారు. “వాళ్ళు 11 మందే ఉన్న 1100 మంది ఉన్నట్లు ఒకే గొంతుతో మాట్లాడుతుంటారు… అది అబద్దమైన సరే!” అన్నారు.
ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు. గొడ్డలి పార్టీతో అప్రమత్తంగా ఉండకపోతే మనమే (నష్ట)పోతాం అని!
సిఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు నేడు మరో విషయం కూడా చెప్పారు. అందరూ తప్పనిసరిగా ఏఐ, ఐటి రంగంలో వస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణల గురించి అవగాహనా పెంచుకుంటూ ఉండాలని చెప్పారు.
76 ఏళ్ళ వయసున్న సిఎం చంద్రబాబు నాయుడు క్వాంటం కంప్యూటింగ్ వరకు వెళ్ళిపోతే అయన కంటే వయసులో చాలా చిన్నవాళ్ళయిన మంత్రులు, ఎమ్మెల్యేలు నేర్చుకోకపోతే ఎలా?
కానీ నేటికీ మన రాజకీయ నాయకుల్లో, ప్రజా ప్రతినిధులలో చాలా మందికి మొబైల్ ఫోన్ వాడటం కూడా సరిగ్గా రాదంటే నమ్మశక్యంగా ఉంటుందా?
కనుక ఏఐ కంటే ముందు మొబైల్ ఫోన్, కంప్యూటర్ ఎలా వాడాలో నేర్చుకోవడం చాలా అవసరం. ఈ రోజుల్లో… ఇంత వయసు వచ్చాక.. సిఎం చంద్రబాబు నాయుడు చెప్పాల్సివస్తే బాగుంటుందా?




