ఆర్టీసీ విషయంలో ఒక్కో ప్రభుత్వం వైఖరి ఒక్కోలా ఉంటుంది. ఇదివరకు కేసీఆర్ హయంలో టిజీఎస్ ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ఏకధాటిగా సమ్మె చేసినప్పుడు ఆర్ధిక సమస్యలు, ఆందోళన ఇంకా వివిధ కారణాల వలన 39 మంది కార్మికులు చనిపోయారు.
వారిలో కొందరు గుండెపోటుతో చనిపోగా కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అయినప్పటికీ కేసీఆర్ కరుణించలేదు. ఆర్టీసీ కార్మికులు బేషరతుగా సమ్మె విరమించకపోతే ఆర్టీసీని మూసేస్తానని అప్పుడు అందరూ రోడ్డున పడతారని బెదిరించారు.
చివరికి అయన సూచించినట్లే సమ్మె విరమించాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆర్టీసీలో యూనియన్లు లేకుండా చేశారు. ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఆర్టీసీ కార్మికులు నోరెత్తకుండా చేశారు.
తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చాలా రకాలుగా ఉపశమనం కలిగించింది. కానీ మహాలక్ష్మి పధకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారిపై పని ఒత్తిడి పెరిగింది. కనుక కొత్తగా కొన్ని ఉద్యోగాల భర్తీ చేసింది. ఇంకా చేస్తోంది. పాత డొక్కు బస్సుల స్థానంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతోంది.
ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు తప్ప కార్మికులకు చేసిన మేలు ఏమీ లేదు.
చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. కనుక ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై ఒత్తిడి పెరిగింది. కనుక ఏపీ ప్రభుత్వం కూడా పెరిగిన పని భారానికి తగినట్లు ఉద్యోగాలు భర్తీ చేస్తోంది.
తాజాగా సిఎం చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్లతో పాటు మిగిలిన ఉద్యోగులందరిలో ‘మెడికల్ అన్ ఫిట్’ అయినవారికి కాస్త తేలికపాటి పనులున్న పోస్టులు కేటాయించాలని ఆదేశించారు. ముందుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డ్రైవర్, కండక్టర్లకు, మెకానిక్స్ తర్వాత మిగిలినవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
కేసీఆర్ నిరంకుశ, అహంకార ధోరణికి 39 మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు బలైపోగా, సిఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీ కార్మికుల పట్ల ఇంత మానవతా దృక్పదంతో వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ ఆర్టీసీ కార్మికుల పట్ల వారి వ్యవహార ధోరణిలో ఎంత తేడా ఉందో కదా?




