వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో ఎంత భీభత్సం సృష్టించారో అందరికీ తెలుసు. శాసనసభ మొదలు తిరుమల వరకు ప్రతీచోట వైసీపీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలే కనిపించేవి.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతిలో భూకబ్జాలు, తుడా నిధుల దుర్వినియోగం గురించి అనేక వార్తలు వచ్చాయి. చివరికి చెవిడ్డి వలననే బాలినేని వైసీపీ వీడాల్సి వచ్చింది. మద్యం కుంభకోణంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉందని సిట్ అధికారులు గుర్తించడంతో ఆయనని అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో పెట్టారు.
కోర్టు అనుమతితో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయనని సిట్ కస్టడీకి తీసుకొని ప్రశ్నించనుంది. ఈరోజు ఉదయం పోలీసులు విజయవాడ జైలు నుంచి సిట్ కార్యాలయానికి తరలిస్తుండగా ఆయన సిఎం చంద్రబాబు నాయుడుకి శాపాలు పెట్టారు.
అక్కడే ఉన్న మీడియాకు వినపడేలా, “నన్ను ఆక్రమాకేసులో ఇరికించి జైలుకి పంపారు.ఈ కుట్ర కేసు వెనుక ఓ సుకుమార్, ఓ రాజమౌళి గొప్ప దర్శకుడు ఉన్నాడు. దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. తప్పు చేస్తున్న ప్రతీ ఒక్కరినీ శిక్షిస్తాడు,” అని బిగ్గరగా కేకలు వేశారు. పోలీస్ అధికారులు ఆయనని బలవంతంగా వ్యానులో ఎక్కించి తీసుకువెళ్ళారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్, చెవిరెడ్డితో సహా వైసీపీలో అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు, పైనుంచి దేవుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. తప్పులు చేసిన ప్రతీ ఒక్కరినీ శిక్షిస్తాడనే స్పృహ, భయం కలిగి ఉండి ఉంటే ఆ విదంగా వ్యవహరించి ఉండేవారే కారు.
కానీ తాము ఏం చేసినా ఆ దేవుడు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఏమీ చేయడానే ధీమాతోనే భక్తులు పరమ పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారు. రాష్ట్రంలో దేవాలయాలలో అనేక అపచారాలు చేశారు.
కానీ చెవిరెడ్డి చెప్పినట్లుగానే నిజంగానే తిరుమల వెంకన్న అన్నీ చూశాడు. వైసీపీ నేతలు చేసిన తప్పులకు శిక్షలు పడేలా చేశాడు. కానీ నేటికీ ‘తలకాయలు నరికేస్తాం’ అని బెదిరిస్తూనే తాము నీతివంతులమని, దేవుడికి, చట్టానికి, ప్రజాస్వామ్యానికి, ప్రజలకు కట్టుబడి పని చేశామని, చేస్తున్నామని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు నమ్మినా నమ్మకపోయినా వారు చేసిన తప్పులేమిటో వారికీ ఆ దేవుడికీ తెలుసు. కనుకనే ఫలితం అనుభవిస్తున్నారు. వైసీపీ నేతలు చేసిన తప్పులు కంటికి కనపడుతున్నప్పుడు, వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు సుకుమార్ లేదా రాజమౌళి వంటి దర్శకత్వం అవసరమే లేదు.




