ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే అటు ప్రభుత్వం కానీ ఇటు ప్రజలు గానీ ఇదని ఖచ్చితంగా సమాధానం చెప్పలేని దుస్థితి దాపురించింది. రాజధాని కోసం రాష్ట్రంలో జరుగుతున్న కుమ్ములాటలు, రాజకీయాలు చూసి ఇరుగుపొరుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా నవ్వుకొంటున్నారు. అయితే ఈ అవమానాలు మనకి సరిపోవన్నట్లు వైసీపీ ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టులో పంచాయతీ పెట్టింది. ఇంతకాలం దీని గురించి తెలియనివారెవరైనా మిగిలి ఉంటే వారికి కూడా డప్పుకొట్టి మరీ చాటిచెప్పుకొన్నట్లయిందిప్పుడు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అక్కడ గత ప్రభుత్వం మొదలుపెట్టిన నిర్మాణ, అభివృద్ధి పనులను ఆరు నెలల్లో పూర్తిచేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో ఈ పంచాయతీ గురించి ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. తమ ప్రభుత్వం మూడు రాజధానులతో అధికార వికేంద్రీకరణ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకొంటోందని కనుక హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు విచారణలో తమ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ రాజధాని రైతులు కూడా వేరేగా పిటిషన్లు వేశారు.
వాటన్నిటిపై నేడు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ ఈ రాజధాని పంచాయతీపై తాడోపేడో తేల్చేస్తారనుకొంటే, ఈ కేసులను తాను విచారణ జరపాలనుకోవడం లేదని కనుక తాను సభ్యుడిగా లేని సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఈ కేసులను బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఆయన ఈ కేసుల విచారణకు ఎందుకు దూరంగా ఉండాలనుకొంటున్నారో తెలీదు కానీ ఈ మూడు రాజధానుల డ్రామాలకు ఒక్క సుప్రీంకోర్టు మాత్రమే తెర దించగలదు. సుప్రీంకోర్టు నిర్ణయంపైనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ అమరావతినే రాజధానిగా ఖరారు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇక మూడు రాజధానుల డ్రామాను తక్షణం ముగించి అయిష్టంగానైనా అమరవతిలో పనులు మొదలుపెట్టక తప్పదు.
ఒకవేళ సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో తాము కలుగజేసుకోలేమని, రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని చెపితే వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో ఈ మూడు రాజధానుల డ్రామాలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందువల్ల అంటే ముందుగా నిధుల కొరత, ఆ తర్వాత పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉండటం, రాజధానిని విశాఖకు తరలించడానికి ఏర్పాట్లు, వేలాదిమంది ఉద్యోగులకు కార్యాలయాలు, వసతి సౌకర్యాలు కల్పించడం, వారి రాకతో విశాఖలో పెరిగే జనాభా, వాహనాలకు సరిపడా రోడ్లు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటివన్నీ ముందుగా ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ రాత్రికి రాత్రి చేయగలిగే పనులు కావు. కనీసం మరో ఏడాదిపైనే పడుతుంది. అప్పటికి ఎన్నికలు వచ్చేస్తాయి. దాంతో మూడు రాజధానుల కధ మళ్ళీ మొదటికొస్తుంది. మళ్ళీ వైసీపీ గెలిస్తే మూడు రాజధానులు లేకుంటే అమరావతి రాజధాని అవుతుంది.



