వివేకానంద రెడ్డి దారుణ హత్య జరిగి అప్పుడే ఆరున్నరేళ్ళవుతోంది. దాని విచారణ ఒకడుగు ముందుకి, మూడడుగులు వెనక్కు అన్నట్లు సాగుతోంది. సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ఆ కేసుకి సంబంధించి పిటిషన్లు పడినప్పుడే ఇంకా ఆ కేసు ఒకటి ఉందని ప్రజలకు గుర్తు వస్తుంది.
ఓ రాజకీయ ప్రముఖుడు అంత దారుణంగా హత్య చేయబడితే ఆరున్నరేళ్ళు గడిచినా ఇంతవరకు దోషులను గుర్తించలేకపోవడం, శిక్షించలేకపోవడం మన న్యాయ వ్యవస్థల వైఫల్యం అనుకోవాలో లేదా వాటి లొసుగులనుకోవాలో అర్ధం కాదు.
ఈ కేసు ఇంకా తేలలేదు కానీ నాడు వివేక హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా చేసిన శంకరయ్య ఇప్పుడు సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపినట్లు తెలుస్తోంది. నాడు తనపై అభాండాలు వేసి తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను సిఎం చంద్రబాబు నాయుడు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలని లేకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవాలని దానిలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. శంకరయ్య తరపున జి.ధరణీశ్వర రెడ్డి సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తోంది.
ఈ లీగల్ నోటీస్పై టీడీపి, కూటమి ప్రభుత్వం ఇంతవరకు బహిరంగ ప్రకటన చేయలేదు. కానీ ఇది సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా ప్రతిష్టకు సంబందించిన విషయమే. కనుక నేడో రేపో స్పందించవచ్చు.
నాడు వివేక వంటి ప్రముఖుడి హత్య కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు అప్పటి కూటమి ప్రభుత్వం శంకరయ్యని ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయగా, జగన్ అధికారంలోకి రాగానే సస్పెన్షన్ ఎత్తివేసి మళ్ళీ విధులలో తీసుకుంది.
కానీ ఇన్నేళ్ళు మౌనంగా ఉండిపోయిన శంకరయ్య ఇప్పుడు హటాత్తుగా సిఎం చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపించడం నిజమే అయితే తప్పకుండా దీని వెనుక ఏదో బలమైన రాజకీయ హస్తం ఉండి ఉండవచ్చు. ఏదో పెద్ద గూడు పుఠాణీ జరుగుతోందని అనుమానించక తప్పదు.
లేకుంటే సీఐగా చేస్తున్న శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీస్ పంపే సాహసం చేస్తారనుకోలేము. అదీ… ఇనేళ్ళ తర్వాత!






