విశాఖ రాజధాని అంటూ జగన్ విశాఖ నగరాభివృద్ధికి చేసిందేమీ లేదు. ఎక్కడికక్కడ గుంతలు పడిన రోడ్లను కనీసం పూడ్చలేదు. చెత్తపన్ను ముక్కు పిండి వసూలు చేయడమే తప్ప ఎప్పటికప్పుడు చెత్త తొలగించింది లేదు. విశాఖ రాజధాని పేరుతో వైసీపి నేతల భూకబ్జాలకు అంతే లేదు.
చంద్రబాబు నాయుడుకి చాతకాదని ఎద్దేవా చేసే జగన్ తాను కోరుకున్నట్లుగానే 5 ఏళ్ళ వ్యవధిలో విశాఖలో రాజధాని ఏర్పాటు చేయలేకపోయారు. కానీ ఆ పేరుతో పచ్చటి ఋషికొండని తవ్వించేసి, దానిపై ప్రకృతిలో కలిసిపోయిన్నట్లు ఉండే పర్యాటకశాఖ భవనాలను కూల్పించేసి తన కోసం రూ.500 కోట్లతో విలాసవంతమైన ప్యాలస్లు నిర్మించుకున్నారు.
ఉత్తరాంధ్రా పర్యటనకు వచ్చిన సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వీలుచేసుకొని ఋషికొండపై జగన్ కట్టించుకున్న ఆ ప్యాలస్లను చూసి దిగ్బ్రాంతి చెందారు. తాను దేశవిదేశాలలో ఎంతో మంది ప్రముఖుల ఇళ్ళని చూశాను కానీ ఇంత విలాసవంతమైన ప్యాలస్ని ఎన్నడూ చూడలేదన్నారు.
తాను పేదవాడినని చెప్పుకునే జగన్ తన కోసం రూ.500 కోట్లు ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చుచేసి తన కోసం ఏడు బ్లాకులలో ప్యాలస్లు కట్టుకోవడాన్ని సిఎం చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు.
పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు ఇదివరకే ఈ ప్యాలస్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ ప్యాలస్లను ప్రతీరోజు శుభ్రం చేయడానికి, విద్యుత్ వినియోగం, చుట్టూ ఏర్పాటు చేసుకున్న గార్డెన్ నిర్వహణ, మూడు షిఫ్టులలో పోలీస్ బందోబస్త్ కలిపి నెలనెలా భారీగా ఖర్చు అవుతోందని, కనుక ఓసారి వీటిని సందర్శించి వీటిని ఏవిదంగా వినియోగించుకోవాలో నిర్ణయించమని మంత్రి, ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తుండటంతో తాను ఇక్కడికి వచ్చానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
అయితే వారు చెప్పిన దానికంటే పదిరెట్లు ఎక్కువ ప్యాలస్ల నిర్వహణ వ్యయం అవుతున్నట్లు తాను గుర్తించానని చెప్పారు. కనుక ఈ భారం తగ్గించుకునేందుకు తాను మంత్రులతో చర్చించి త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటానని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.




