Revanth Reddy KTR

ఏపీలో టిడిపి-వైసీపిల మద్య సోషల్ మీడియా కేసుల పేరుతో భీకర యుద్ధం సాగుతుంటే, తెలంగాణలో కేటీఆర్‌ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ పార్టీల మద్య యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ సిఎం చంద్రబాబు నాయుడు వైసీపి సోషల్ మీడియా పోటుగాళ్ళని లోపల వేయగలుగుతున్నారు. కానీ అక్కడ రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌లను అరెస్ట్ చేస్తామని పదేపదే చెపుతున్నారు కానీ చేయలేకపోతున్నారు!

వారిని వలవేసి పట్టడానికి రేవంత్‌ రెడ్డి చాలా కేసులే లైన్లో పెడుతున్నారు. కానీ ఏ కేసులో అరెస్ట్ చేసినా రెండు నెలల్లో బెయిల్‌పై బయటకు వచ్చేస్తామని కేటీఆర్‌ ముందే చెప్పేస్తున్నారు. దమ్ముంటే అరెస్ట్ చేసుకోమని సవాలు కూడా విసురుతున్నారు.

Also Read – జగన్‌ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!

కనుక కేటీఆర్‌ని అరెస్ట్ చేసి చూపడం ఇప్పుడు రేవంత్‌ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారిందని చెప్పవచ్చు. కేటీఆర్‌ కోసం ఫార్ములా-1 రేసింగ్ వ్యవహారం, జన్వాడలో బావమరిది ఫామ్‌హౌస్‌లో రేవ్‌పార్టీ, తాజాగా లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులని ముందుకు జరుపుతున్నారు.

ఒకవేళ తనని అరెస్ట్ చేస్తే దానిని బిఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా అనుకూలంగా ఏవిదంగా మలుచుకోవాలో ప్లాన్ సిద్దం చేసుకొని కేటీఆర్‌ పోలీసుల కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్‌ విధ్వంసానికి…

రైతుల తరపున తాము పోరాడుతూ తాను వందసార్లు జైలుకి వెళ్ళేందుకు సిద్దమని కేటీఆర్‌ చెప్పడం చూస్తే, ఈ దాడి కేసుని కూడా తమ పార్టీకి అనుకూలంగా తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్దమవుతూనే ఉంది.

లగచర్ల గ్రామంలో భూసేకరణ రేవంత్‌ రెడ్డి సోదరుడి ఫార్మా కంపెనీ కోసమే అనే కేటీఆర్‌ వాదనలు కూడా ప్రజలలోకి వెళ్లిపోయాయి. కనుక దాని వలన కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుంది.

Also Read – ఈ విందుని జగన్‌ జీర్ణించుకోలేరేమో?

అయితే కేసీఆర్‌ అంతటివాడినే ఓడించి ఫామ్‌హౌస్‌లో నుంచి బయటకు రాకుండా కూర్చోబెట్టిన రేవంత్‌ రెడ్డి, కేటీఆర్‌ని తగిన విదంగానే లోపల వేయాలని ముందస్తు ఏర్పాట్లన్నీ చేస్తున్నారు.

లగచర్ల గ్రామంలో జిల్లా కలెక్టర్‌పై దాడిలో కేటీఆర్‌ హస్తం కూడా ఉందని నిరూపించేందుకు రిమాండ్‌ రిపోర్టులో ఆయన పేరుని జోడించారు. కానీ పోలీసులు… ఆ దాడితో కేటీఆర్‌ని సరిగ్గా కనెక్ట్ చేయగలిగితేనే ప్రజలలో దోషిగా నిలబెట్టగలరు లేకుండా ఈ కేసు రేవంత్‌ రెడ్డికి బ్యాక్ ఫైర్ అవుతుంది. కనుక కాస్త ఆలస్యమవుతున్నా పక్కా సాక్ష్యాధారాలని సిద్దం చేయిస్తున్నారు.

రేవంత్‌ రెడ్డి రెండు నెల్లో బయటకు వచ్చేస్తానని పదేపదే చెపుతున్నారు కనుక ఆ అవకాశం లేకుండా చేసేందుకు అనేక కేసులు లైన్లో పెడుతున్నారు.

కనుక ఈ భూసేకరణ విషయంలో రేవంత్‌ రెడ్డి, కలెక్టర్‌పై దాడి కేసులో కేటీఆర్‌ ఇద్దరూ చిక్కుక్కున్నట్లే ఉన్నారు. ఇద్దరి మద్య జరుగుతున్న ఈ పవర్ పాలిటిక్స్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.