ఐదేళ్ళ జగన్ అరాచక, విధ్వంస పాలన చూసిన తర్వాత కూడా ఏపీకి పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు మొహం చూసే అని చెప్పక తప్పదు.
విశాఖ-భీమిలి మద్య కాపులుప్పాడ వద్ద ఐటి హిల్స్పై ప్రఖ్యాత ఐటి కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఏర్పాటు కాబోతోంది. ఈ విషయం ఆ సంస్థ స్వయంగా ఎక్స్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
కాపులుప్పాడ వద్ద ఐటి హిల్స్పై 22 ఎకరాలలో రూ. 1583 కోట్లు పెట్టుబడితో కాగ్నిజెంట్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలియజేసింది.
తమ కంపెనీలో 8,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని తెలియజేసింది. 2029 జనవరిలోగా తమ కార్యాలయ భవన సముదాయాల మొదటి దశ నిర్మాణ పనులు పూర్తవుతాయని తెలిపింది. కానీ 2026 మొదటి త్రైమాసికంలోనే విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కాగ్నిజెంట్ తెలిపింది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో అర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోడీ విశాఖ వచ్చినప్పుడు దీనికి వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం నక్కపల్లిలో ఎకరం రూ.51,39,690 చొప్పున 2,080.76 ఎకరాలు కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. దీని కోసం మిట్టల్ కంపెనీ తొలి విడతలో రూ.450 కోట్లు ప్రభుత్వానికి చెల్లించింది. మిగిలిన సొమ్ముని 9 శాతం వడ్డీతో మరో రెండు విడతాల్లో చెల్లిస్తుంది.
ఈ ప్లాంట్లో మొదటి రెండు దశల నిర్మాణాలు పూర్తయితే వాటిలో ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. ఈ ప్లాంట్ నిర్మాణ సమయంలోనే వేలాదిమందికి ఉద్యోగాలు, ఉపాధి లభిస్తుంది. ఉత్పతి మొదలైతే సుమారు 25-30,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
ఈ స్టీల్ ప్లాంట్కు అవసరమైన బొగ్గు, ఇతర ముడిసరుకులు దిగుమతి చేసుకునేందుకు, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఉక్కుని విదేశాలకు ఎగుమతి చేసేందుకు నక్కపల్లికి సమీపంలోనే మరో రూ.70 వేల కోట్లతో ఓ ప్రైవేట్ పోర్టు నిర్మించబోతోంది.
కనుక వీటి కారణంగా రాబోయే 4 ఏళ్ళలో ఇటు విశాఖ, అటు అనకాపల్లి రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. గతంలో ఉద్యోగాల కోసం యువత ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్ళేవారు. కానీ ఇకపై ఏపీలోనే భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి.




