ఈ ప్రపంచంలో తాను ఆనందంగా ఉంచాల్సిన వ్యక్తులు ముగ్గురంటే ముగ్గురున్నారని హాస్య నటుడు సప్తగిరి తెలిపాడు. తన కోసం ఎంతో చేసిన తన తల్లిదండ్రులు, సోదరుడ్ని ఆనందంగా ఉంచాల్సిన బాధ్యత తనపై ఉందని… అయితే తిరుమలేశుని దయవల్ల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, వాటి ద్వారా ఆదాయం వస్తోందని, దానితో వారి కోరికలన్నీ తీర్చగలుగుతున్నానని అన్నాడు.
ఇప్పటి వరకు నాకు ఇంత రెమ్యూనరేషన్ ఇవ్వండి అని తానెవరినీ అడగలేదని సప్తగిరి చెప్పాడు. తనతో పని చేయించుకోవడం కొత్త మొత్తం ఇవ్వడం దర్శక నిర్మాతలకు తెలుసని అన్నాడు. ఇప్పుడు తానున్న స్థాయిని చూసి తన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని చెప్పాడు. ఏదైనా చెయ్యాలా? అని వారినడిగితే చాల్లేరా అంటారని సప్తగిరి తెలిపాడు. ఈ ముగ్గురిని సంతోషంగా ఉంచగలిగితే తనకు చాలని చెప్పాడు ఈ సూపర్ కమెడియన్.
ఎదిగే సమయంలో ఒదిగి ఉండాలి… లేదంటే ఎదుగుదల కష్టసాధ్యమవుతుంది అన్న విషయం సినీ జనాలకు తెలిసిందే. బహుశా ఈ విషయాలను సప్తగిరి చెవిన వేసినట్టున్నారు… డౌన్ టు ఎర్త్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం సప్తగిరి రేంజ్ టాప్ కాకపోయినా… సప్తగిరిని చూస్తే గుర్తు పట్టని ప్రేక్షకుడు ఉండడు. అయినప్పటికీ చాలా మృదు స్వభావిగా మాట్లాడుతూ ఒక వ్యక్తిగా తన స్థాయిని మరింత పెంచుకుంటున్నాడు.



