ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధిపతి వేమూరి రాధాకృష్ణకు, వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డికి మద్య చిన్నగా మొదలైన వివాదం ఇప్పుడు బహిరంగచర్చ వరకు వచ్చేసింది. ఇద్దరూ పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకున్న తర్వాత బహిరంగ చర్చకు రావాలని సవాళ్ళు విసురుకున్నారు.
వేమూరి రాధాకృష్ణ అందుకు అంగీకరించి ఢిల్లీలో చర్చకు సిద్దం కావాలని విజయసాయి రెడ్డికి ప్రతి సవాల్ విసిరారు. దానికి విజయసాయి రెడ్డి కూడా సై అంటూనే తప్పించుకోవడానికి చిన్న మెలిక పెట్టారు.
ప్రస్తుతం తాను ఐక్యరాజ్యసమితికి వచ్చానని తిరిగి రాగానే బహిరంగ చర్చకు వస్తానని ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఎన్జీవోలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ వారిని ఆహ్వానించి వారి సమక్షంలో బహిరంగ చర్చ నిర్వహిద్దామని ట్వీట్ చేశారు. ఆ చర్చలో వేమూరి రాధాకృష్ణ బండారం అంతా బయటపెడతానని హెచ్చరించారు.
ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళ కార్యక్రమం మొదలైన తర్వాతే వేమూరి రాధాకృష్ణ ఓ కొత్త విషయం బయటపెట్టారు. వైసీపి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి రహస్యంగా తన కార్యాలయానికి వచ్చి కలిసి రాజీ ప్రయత్నాలు చేసేవారని చెప్పారు. తాను జగన్ ఒత్తిడి వల్లనే ఆవిదంగా ట్వీట్స్ చేస్తున్నాను తప్ప నిజంగా తనకు అటువంటి ఉద్దేశ్యం, అభిప్రాయం లేవని విజయసాయి రెడ్డి చెప్పేవారని వేమూరి రాధాకృష్ణ బయటపెట్టారు.
అటువంటప్పుడు విజయసాయి రెడ్డి నిజాయితీగా ఆంధ్రజ్యోతి స్టూడియోలో కూర్చొని వేమూరి రాధాకృష్ణతో అన్ని విషయాలు చర్చించవచ్చు కదా? కానీ అలా చేస్తే జగన్కు కోపం వస్తుంది. తన బండారం బయటపడుతుంది. దాంతో తన రాజకీయ జీవితం ముగిసిపోతుంది. ఈ భయంతోనే ఢిల్లీలో అందరినీ పోగేసి వారి సమక్షంలో బహిరంగ చర్చ అని మెలిక పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని అర్దమవుతూనే ఉంది.




