నిన్న మొన్నటి వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ మంత్రి కొండా సురేఖని పదవిలో నుంచి తొలగించడం, దానికి సంబంధించిన వార్తాలే వినిపించాయి. కానీ సోమవారం నుంచి మొదలైన శాసనసభ సమావేశాలలో ఆమె విషయం పూర్తిగా కనుమరుగైపోయింది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధాల గురించే చర్చ జరుగుతోంది.
కనుక ఒకవిధంగా కొండా సురేఖకు ఇది చాలా ఉపశమనం కలిగిస్తున్నట్లే భావించవచ్చు. కనుక ఆమె తీరికగా తన భవిష్య కార్యాచరణ గురించి ఆలోచించుకునేందుకు తగిన సమయం లభించిందని చెప్పవచ్చు.
అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇంత భీకరంగా ఎందుకు యుద్ధాలు చేస్తున్నాయి?అనే సందేహం కలుగుతుంది.
రాజకీయాలలో ఒక సమస్యపై నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలంటే మరో సమస్య సృష్టించాలి. లేదా మరో అంశంపైకి ప్రజల దృష్టి మళ్ళించాలి. దేశంలో అన్ని రాజకీయపార్టీలు దశాబ్దాలుగా ఈ ఫార్ములాని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కూడా ఇదే చేస్తున్నట్లనిపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ సమస్య: తెలంగాణ శాసనసభ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హాజరు కాకపోయినా కోట్లాది రూపాయలు జీతభత్యాలు తీసుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వాదన వినిపిస్తోంది. కుదిరితే ఈ శాసనసభ సమావేశాలలో ఈ అంశంపై తీవ్ర నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు పంపింది.
కనుక బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. నిన్న శాసనసభ ఆవరణలో చేసిన హడావుడితో కేసీఆర్ జీతభత్యాల అంశం పక్కకు పోయింది. మరో రెండు మూడు రోజులు ఇలాగే సాగదీస్తే చాలు. శాసనసభ సమావేశాలు ముగిసిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మామూలుగా రాజకీయాలు చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ సమస్య: ఈసారి శాసనసభ సమావేశాలలో తమ వెయ్యి రోజుల పాలన, ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
ఇదిగాక 22ఏ (నిషేధిత భూములు)పేరుతో జరుగుతున్న అక్రమాలు, సర్ ప్రక్రియలో లక్షలాది ఓట్ల తొలగింపు వంటి అంశాలు ఉండనే ఉన్నాయి. కనుక వీటితో తలనొప్పులు వద్దనుకోవడం సహజం.
కనుక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను కేసీఆర్ ఫామ్హౌసు ముట్టడికి పంపించి ఉండవచ్చు. ఊహించినట్లే కేటీఆర్, హరీష్ రావులతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేతలు, వందలాది కార్యకర్తలు అక్కడకి చేరుకునే ప్రయత్నం చేశారు.
దీంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కేసీఆర్ని చంపించేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం గుండాలను ఫామ్హౌసు వద్దకు పంపించిందని వారు వాదిస్తున్నారు. ఇది వారిపార్టీకి మంచి మైలేజ్ ఇస్తుంది. కనుక మరో మూడు నాలుగు రోజులు ఇదే పాట పాడే అవకాశం ఉంది. ఇలాంటి వాదనలని శాసనసభలో, బయటా కాంగ్రెస్ నేతలు చాలా సులువుగా ఎదుర్కోగలరు. కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయ చదరంగంలో గెలుపోటములు ఉండవు.
రెండు పార్టీలు కూడబలుక్కున్నట్లు ఈ డ్రామాలను రక్తి కట్టిస్తున్నాయి. కానీ ప్రజా సమస్యలపై చర్చ పక్కదారి పట్టింది. వాటిపై నుంచి ప్రజల దృష్టి కూడా మళ్ళింది. ఇదే అంతిమ అవుట్ పుట్!





